మెగా హీరో సాయిదుర్గతేజ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక పానిండియా ప్రాజెక్ట్ ‘SYG’ (సంబరాల ఏటిగట్టు). రోహిత్ కేపీ దర్శకుడు. కె.నిరంజన్రెడ్డి, చైతన్యరెడ్డి నిర్మాతలు. ఈ సినిమా నిర్మాణం చివరి దశకు చేరింది. ఈ క్రమంలో కీలక షెడ్యూల్ ఆదివారం నుంచి హైదరాబాద్లో మొదలైంది. అద్భుతమైన యాక్షన్ ప్యాక్డ్ సన్నివేశాలు తీసేందుకు ప్రత్యేకంగా ఓ భారీ సెట్ని నిర్మించారు. ఈ యాక్షన్ సీక్వెన్స్తో పాటు ప్రధాన తారాగణం అంతా పాల్గొనే కీలక ఘట్టాలను ఈ షెడ్యూల్లో చిత్రీకరిస్తారు. సాయిదుర్గతేజ్ కెరీర్లోనే అత్యంత శక్తివంతమైన, ఇంటెన్స్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులకు ఓ కొత్త సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ని ఇవ్వనున్నదని మేకర్స్ చెబుతున్నారు.
పవర్ఫుల్ స్క్రీన్ప్లే, ఉత్కంఠభరితమైన విజువల్స్, హై-ఆక్టేన్ సన్నివేశాల మేళవింపుతో గ్రాండ్ యాక్షన్ డ్రామాగా దర్శకుడు రోహిత్ కేపీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని, ఈ షెడ్యూల్ అనంతరం పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెడతామని, త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు. ఐశ్వర్యలక్ష్మి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, సాయికుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: వెట్రి పళనిసామి, సంగీతం: బి.అజనీష్ లోక్నాథ్, నిర్మాణం: ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్స్.