స్టార్ హీరోయిన్ సమంత అరుదైన వ్యాధి బారిన పడింది. తను ‘మయోసైటిస్’ అనే రుగ్మతకు చికిత్స తీసుకుంటున్నట్లు ఆమె తాజాగా వెల్లడించింది. కొద్ది నెలల క్రితం తనకు ఈ వ్యాధి ఉన్నట్లు వైద్యులు గుర్తించారని ఆమె సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తెలిపింది. ఒకవైపు స్లైన్ తీసుకుంటూనే తన కొత్త సినిమాకు డబ్బింగ్ చెబుతున్న ఫొటోను షేర్ చేసింది సమంత. ఆమె స్పందిస్తూ…“యశోద’ చిత్ర ట్రైలర్కు మీరు ఇచ్చిన ఆదరణ ఎంతో సంతోషంగా ఉంది.
ఇదే ప్రేమను నేనూ మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. మీరు నాపై చూపిస్తున్న ప్రేమే జీవితంలో ఎదురయ్యే గడ్డు పరిస్థితులను ఎదుర్కొనే మానసిక స్థైర్యాన్ని అందిస్తున్నది. మనం ఎంత బలంగా నిలబడినా..ఇబ్బందులకు తలొగ్గక తప్పదు. కొద్ది నెలల క్రితం నాకు మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూన్ రుగ్మత ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం నా ఆరోగ్యం నిలకడగా ఉంది. త్వరలోనే కోలుకుంటానని వైద్యులు చెబుతున్నారు. మానసికంగా, శారీరకంగా ఎన్నో కష్టసుఖాలు చూశాను. ఈ రోజు గడిస్తే చాలనుకున్న పరిస్థితులున్నాయి. అలాగే ఇదీ గడిచిపోతుందని ఆశిస్తున్నా’ అని పేర్కొంది. ప్రస్తుతం ఆమె ‘యశోద’, ‘ఖుషి’ చిత్రాలతో పాటు హిందీలో ‘సిటాడెల్’ వెబ్ సిరీస్లో నటిస్తున్నది.