ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్(Salman Khan) సహనాన్ని కోల్పోయారు. ఫోటోగ్రాఫర్లపై ఆయన తీవ్ర ఆగ్రహన్ని వ్యక్తం చేశారు. అరవై ఏళ్లు వచ్చాయని, కానీ తాను పోరాటం చేయడం మరవలేదన్నారు. మంగళవారం రాత్రి సల్మాన్ ఖాన్ హిందూజా ఆస్పత్రికి వెళ్లారు. అయితే ఆ సమయంలో కొందరు ఫోటోగ్రాఫర్లు ఆయన్ను వెంబడించారు. భాయ్ భాయ్ అంటూ ఫాలో అయ్యారు. ఆస్పత్రి నుంచి బయటకు వస్తున్న సమయంలోనూ అతని కోసం ఎదురు చూశారు. దీంతో సల్మాన్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. సల్మాన్ ఓ దశలో తన కారు నుంచి బయటకు వచ్చిన ఫోటోగ్రాఫర్లకు వార్నింగ్ ఇచ్చారు. దీంతో వాళ్లు సారీ చెప్పినట్లు తెలిసింది. ఈ ఘటనకు చెందిన వీడియోలు కూడా వైరల్ అయ్యాయి.
అయితే హిందూజా ఆస్పత్రిలో ఎవర్నీ కలిసేందుకు సల్మాన్ వెళ్లారన్నది తెలియదు. కానీ ఇవాళ ఉదయం సల్మాన్ తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఇన్స్టాగ్రామ్లో వరుసగా పోస్టులు పెట్టారు. తన ప్రైవసీలోకి దూసుకొస్తున్న ఫోటోగ్రాఫర్లను తప్పుపట్టారు. తాను బాధలో ఉన్నప్పుడు ఆస్పత్రి వద్ద ప్రెస్ ఆ సందర్భాన్ని ఎంజాయ్ చేస్తున్నట్లు గమనిస్తే తాను సహించబోనన్నారు. మీడియా మిత్రులకు గతంలో అండగా నిలిచానని, వారి కేర్ తీసుకున్నానని, వాళ్లకు కావాల్సిన తిండి దొరికేలా చేశానన్నారు. కానీ తన నష్టాల నుంచి ప్రెస్ డబ్బులు సంపాదించాలని చూస్తే తానేమీ మౌనంగా ఉండబోనన్నారు.
వ్యక్తిగత అంశాల్లో జోక్యం చేసుకుంటే వంద సినిమాలనైనా తగలబెడుతానని సల్మాన్ అన్నారు. తనకు 60 ఏళ్లు వచ్చాయని, కానీ తానేమీ పోరాటం చేయడం మరవలేదన్నారు. తాజాగా మాతృభూమి చిత్రంలో సల్మాన్ నటిస్తున్నారు. అపూర్వ లఖియా దాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. 2020లో జరిగిన గల్వాన్ ఘర్షణ ఆధారంగా ఆ ఫిల్మ్ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.