Rajpal Yadav : రూ.9 కోట్ల చెక్ బౌన్స్ కేసులో నటుడు రాజ్పాల్ యాదవ్ తిహార్ జైలులో లొంగిపోయిన సంగతి తెలిసిందే. ఈ నెల 5వ తేదీ నుంచి అతడు జైలులోనే ఉన్నాడు. తన దగ్గర డబ్బులు లేవని, వాటిని తిరిగి చెల్లించే స్థితి లేదని అతడు అంతకుముందు మీడియాకు తెలిపాడు. తనను ఆదుకునే స్నేహితులు కూడా లేరని చెప్పాడు. ఇక.. తప్పనసరిగా జైలుకు వెళ్లాల్సిందే అని, ఈ పరిస్థితిని తనొక్కడే ఎదుర్కోవాలని చెప్పాడు. అయితే, ఈ మాటలు బాలీవుడ్ను కదిలించాయి.
దీంతో చాలా మంది వరుసగా అతడికి సాయం చేసేందుకు ముందుకొస్తున్నారు. మొదటగా నటుడు సోనూ సూద్ స్పందించారు. కొంత సాయం అందిస్తున్నట్లు చెప్పారు. తనలాగే సినిమా ఇండస్ట్రీ కూడా స్పందించాలని కోరాడు. దీంతో చాలామంది సినీ ప్రముఖులు, టీవీ రంగ ప్రముఖులు అతడికి సాయం చేస్తున్నారు. స్టార్స్, డైరెక్టర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్, పొలిటీషియన్స్.. ఇలా పలువురు సాయం అందిస్తున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్స్ సల్మాన్ ఖాన్, అజయ్ దేవగణ్, వరుణ్ ధావన్, అనీస్ బజ్మీ, గుర్మీత్ చౌదరి, డేవిడ్ ధావన్, రతన్ నైన్, కమల్ ఆర్ ఖాన్, నవాజుద్దీన్ సిద్ధిఖీ సహా పలువురు ప్రముఖులు తలా కొంత సాయం చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే జెమ్ ట్యూన్స్ సంస్థ అధినేత, రావ్ ఇంద్రజీత్ సింగ్ యాదవ్.. తన సంస్థ తరఫున రూ.1.1 కోట్లు సాయం చేస్తానని ప్రకటించారు.
అలాగే రాజకీయ నాయకుడు తేజ్ ప్రతాప్ యాదవ్ రూ.11 లక్షలు ప్రకటించారు. రాజ్పాల్ యాదవ్ దర్శకుడిగా 2012లో రూపొందించిన అటా పటా లాపటా అనే సినిమాకు నష్టాలు రావడంతో అప్పుల్లో కూరుకుపోయారు. వాటికి సంబంధించి చెల్లించాల్సిన రూ.9 కోట్ల చెక్ బౌన్స్ కేసులో అతడు కోర్టులో లొంగిపోయాడు. అతడు డబ్బు చెల్లించేందుకు ఇంకాస్త సమయం కోరినప్పటికీ ఢిల్లీ కోర్టు నిరాకరించింది. దీంతో తన దగ్గర డబ్బులు లేవని చెబుతూ రాజ్పాల్ యాదవ్ కోర్టులో లొంగిపోయాడు. మరోవైపు అతడికి రెండు రోజుల్లో బెయిల్ వచ్చే అవకాశం ఉందని అతడి మేనేజర్, లాయర్ తెలిపారు.