Salman Khan | బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్కు షాక్ తగిలింది. నటుడికి అత్యంత సన్నిత సంబంధాలున్న బాబా సిద్ధిఖీని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ లక్ష్యంగా చేసుకొని ఈ నెల 12న కాల్చి చంపింది. ఆ తర్వాత సల్మాన్ గెలాక్సీ అపార్ట్మెంట్ పరిసరాలు నిర్మానుష్యంగా మారాయి. అక్కడ ఎవరూ సెల్ఫీలు, వీడియోలు తీసుకోకుండా పోలీసులు నిషేధం విధించారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో పోలీసులు చుట్టుముట్టారు. మీడియా సిబ్బందిని అనుమతించడం లేదు. మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్య నేపథ్యంలో సల్మాన్ ఖాన్కు అదనపు భద్రతను భారీగా పెంచారు. సల్మాన్ ఖాన్ భద్రతను వై ప్లస్కి అప్డేట్ చేశారు. ఎస్కార్ట్ వాహనం కూడా ఏర్పాటు చేశారు. అలాగే, శిక్షణ పొందిన సాయుధ కానిస్టేబుల్ సైతం వెంట వెళ్లనున్నాడు.
సిద్ధిఖీని హత్య చేసింది తామేనని లారెన్స్ బిష్ణోయ్ ప్రకటించిన నేపథ్యంలో భద్రతను పెంచుతూ మహారాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. ఇక సల్మాన్ ఖాన్ ఎక్కడికి వెళ్లినా పోలీసుల నిఘాలోనే ఉండనున్నాడు. సల్మాన్కు చెందిన పన్వెల్ ఫామ్హౌస్ చుట్టూ పోలీసులు భద్రతను పెంచారు. ఫామ్ హౌస్లోకి వెళ్లి, వచ్చే వారిని పర్యవేక్షించేందుకు సిబ్బందిని సైతం నియమించారు. సల్మాన్ ఖాన్ను హత్య చేస్తామంటూ గతంలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హెచ్చరించింది. ఈ క్రమంలోనే బాబా సిద్ధిఖీ హత్యకు గురవడం.. ఘటనకు ఆ గ్యాంగ్ బాధ్యత వహించడం ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది జూన్లోనూ సల్మాన్ చంపేందుకు విఫలయత్నం జరిగిన విషయం తెలిసిందే. అతని కారును ఆపి ఏకే 47 రైపిల్తో దాడి చేయాలని ప్రణాళిక వేయగా.. ముంబయి పోలీసులు కుట్రను భగ్నం చేశారు.