Sai Pallavi | కథానాయికల్లో సాయిపల్లవిది ఓ ప్రత్యేక పంథా. సినిమాలు, వ్యక్తిగత జీవితం రెండు వేటికవే వేరుగా వుండాలని కోరుకునే అమ్మాయి. తాజాగా ఆమె అందరూ ఎంతో పవిత్రంగా భావించే అమర్ నాథ్ యాత్రలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఎప్పుడూ ఇలాంటి వ్యక్తిగత విషయాలపై స్పందించని సాయి పల్లవి తాజాగా అమర్నాథ్ యాత్రపై సోషల్ మీడియా వేదికగా తన మనోభావాలను పంచుకున్నారు. ‘పర్సనల్ లైఫ్ విషయాలను షేర్ చేయడానికి ఇష్టపడను. కానీ అమర్నాథ్ తీర్థయాత్ర గురించి అందరికి వివరించాలనుకుంటున్నా. ఎప్పటి నుంచో వెళ్లాలని కలలు కన్న తీర్థయాత్ర ఇది.
వయసులో పెద్దవారైన నా తల్లిదండ్రులను ఈ యాత్రకు నాతో పాటుగా తీసుకెళ్లడం ఎంతో రిస్క్గా అనిపించింది. కొన్ని సార్లు వాళ్లు బ్రీత్ తీసుకోవడానికి ఇబ్బందిపడుతుండే వారు. దారి మధ్యలో అలిసిపోవడం వంటి పరిస్థితులు చూసి, ‘దేవుడా, మీరు ఎందుకు అంత దూరంలో వున్నారు? అని ప్రశ్నించేలా చేశాయి. దేవుడి దర్శనం అనంతరం నా ప్రశ్నకు సమాధానం దొరికింది. అమర్నాథ్ కొండ నుంచి కిందికి వచ్చేటప్పుడు హృదయానికి హత్తుకునే అపురూపమైన దృశ్యాన్ని చూశా. పలు సవాళ్ల కారణంగా యాత్ర కొనసాగించలేక ఇబ్బంది పడుతున్న యాత్రికుల కోసం, పక్కన సహా యాత్రికులు ‘ఓం నమ: శివాయా’ అంటూ ఆ దేవుడిని గట్టిగా జపించారు. మా వల్ల కాదు, ఇక వెళ్లలేం అనుకున్న యాత్రికులు ఒక్కసారిగా స్వామి వారిని మనసులో తలచుకుని ముందుకు కదిలారు.
మాలాంటి లక్షలాది భక్తులకు ఈ యాత్ర ఎంతో చిరస్మరణీయంగా నిలవడానికి కారణమైన శ్రీ అమరనాథ్ జీ పుణ్యక్షేత్రం బోర్డులోని ప్రతి ఒక్కరికి నా హృదయాపూర్వక కృతజ్ఞతలు. ఎటువంటి స్వార్థం లేకుండా చేసే సేవలకు ఇది ప్రతీకగా నిలుస్తుంది కాబట్టే ఈ ప్రదేశం పవర్ఫుల్. సంపద, అందం, పవర్తో సంబంధం లేకుండా ఇతరులకు సాయం చేయడమే మన జీవిత ప్రయాణానికి నిజమైన నిండైన అర్థం. ఈ యాత్ర నా సంకల్పబలానికి, నా శారీరక శక్తికి, ధైర్యానికి పరీక్షపెట్టింది. మన జీవితమే తీర్థయాత్ర అని తెలిసేలా చేసింది. మనిషిగా పుట్టినందుకు కష్టాల్లో వున్న వారికి సాయం చేయకపోతే మనం మరణించిన వారితో సమానమని తెలియజేసింది’ అంటూ సాయిపల్లవి ఓ సుదీర్ఘమైన లెటర్ను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్గా మారింది.