సినిమాల ఎంపికలో చాలా సెలెక్టివ్గా ఉంటుంది అగ్ర కథానాయిక సాయిపల్లవి. కథలో కొత్తదనం ఉంటేనే అంగీకరిస్తుంది. పాత్రలపరంగా కూడా ప్రతి చిత్రంలో వైవిధ్యాన్ని ప్రదర్శించాలని ప్రయత్నిస్తుంటుంది. అందుకే ఈ తమిళ సోయగానికి స్టార్ హీరోలకు ఉన్నంత క్రేజ్ ఉంది. ప్రస్తుతం ఈ భామ తెలుగులో నాగచైతన్య సరసన ‘తండేల్’ చిత్రంలో నటిస్తున్నది. తాజా సమాచారం ప్రకారం ఆమె విజయ్ దేవరకొండతో జోడీ కట్టబోతున్నదని తెలిసింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ మూడు చిత్రాలతో బిజీగా ఉన్నారు. దిల్ రాజు నిర్మాణంలో రవికిరణ్ కోలా దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్నది. గ్రామీణ నేపథ్యంలో యాక్షన్ కథాంశమిది. ఇటీవల విజయ్ దేవరకొండ జన్మదినం సందర్భంగా విడుదల చేసిన ప్రచార చిత్రం అందరిలో ఆసక్తిని రేకెత్తించింది. ఈ సినిమాలో సాయిపల్లవిని కథానాయికగా ఎంపిక చేశారని సమాచారం. కథలోని కొత్తదనంతో పాటు తన పాత్ర ఛాలెంజింగ్గా అనిపించడంతో ఆమె ఈ సినిమాకు ఓకే చెప్పిందని అంటున్నారు. అయితే ఈ విషయంలో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం సాయిపల్లవి ‘తండేల్’తో పాటు హిందీలో ‘రామాయణ’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.