సోషల్ మీడియాలో మంగళవారం ఉదయం నుంచీ ప్రచారమవుతున్న తన మృతి వార్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు నటుడు కోట శ్రీనివాసరావు. తాను ఆరోగ్యంగా ఉన్నానని తెలిపారు. ఈ మేరకు ఓ వీడియోను ఆయన విడుదల చేశారు. కోట శ్రీనివాసరావు స్పందిస్తూ…‘ నేను చనిపోయానని కొందరు సోషల్ మీడియా పోస్టులు చేస్తున్నట్లు తెలిసింది.
ఈ వార్తలు విని బాధకు గురయ్యా. డబ్బు సంపాదించేందుకు ప్రపంచంలో ఎన్నో మార్గాలున్నాయి. ఇలాంటి తప్పుడు పనులు చేయొద్దని కోరుతున్నా. నేనింకా బతికే ఉన్నా. మీ అసత్య ప్రచారంతో కుటుంబ సభ్యులు బాధపడుతున్నారు. ప్రజలు ఇలాంటి వారికి బుద్ధి చెప్పాలి’ అన్నారు. సినీ తారలను లక్ష్యంగా చేసుకుని కొన్ని యూట్యూబ్ ఛానెల్స్, వెబ్ సైట్స్లో అసత్య ప్రచారాలు చేస్తున్నారని.. వారిపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్లో నటి హేమ ఫిర్యాదు చేశారు.