సుఖేష్ చంద్రశేఖర్ ప్రధాన పాత్రధారిగా సాగిన రెండొందల కోట్ల మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ కథానాయిక జాక్వెలిన్ ప్రమేయం ఉన్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నిర్ధారించిన విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఆమెకు సెప్టెంబర్లో ఢిల్లీ పాటియాలా కోర్టు మధ్యంతర బెయిల్ను మంజూరు చేసింది. దీనిని సవాలు చేస్తూ దర్యాప్తు సంస్థలు కోర్టును ఆశ్రయించి వాదనలు వినిపించాయి. జాక్వెలిన్ దేశం వదిలి వెళ్లేందుకు ప్రయత్నాలు చేసిందని, విచారణకు కూడా ఏమాత్రం సహకరించడం లేదని ఈడీ వాదించింది. విదేశాలకు వెళ్లేందుకు కావాల్సినంత డబ్బు ఆమె వద్ద ఉందని అధికారులు కోర్టుకు తెలిపారు. ఈ వాదనలు విన్న కోర్టు ఇప్పటివరకు జాక్వెలిన్ను ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించింది. ‘ఆమెపై లుక్అవుట్ నోటీస్ జారీ చేసినప్పటికీ అరెస్ట్ మాత్రం చేయలేదు. ఇదే కేసులో మిగతా నిందితులు జైల్లో ఉన్నారు. కానీ జాక్వెలిన్ విషయంలో మీరు ఇతర మార్గాల్ని ఎంచుకున్నారు’ అని కోర్టు ఈడీ అధికారుల్ని ప్రశ్నించింది.