‘ఆర్ఆర్ఆర్’…‘బాహుబలి’కి మించిన సినిమా కానుందా? అంటే..ఆ ప్రశ్నలోనే సమాధానం ఉందని చమత్కరించారు దర్శకుడు రాజమౌళి. ‘రాసిపెట్టుకోండి ఇక నుంచి మల్టీస్టారర్స్ యుగం మొదలవుతున్నది. తెలుగు సినిమా మరో ప్లేన్లోకి వెళ్లిపోనుందని ధీమా వ్యక్తం చేశారు ఎన్టీఆర్. ఉక్రెయిన్లో తనకు సెక్యూరిటీ గార్డ్గా పనిచేసిన యువకుడికి ఫోన్ చేస్తే ‘నా తండ్రి గన్ పట్టుకొని వీధుల్లో పోరుకు సిద్ధమవుతున్నాడు’ అని అతను చెప్పిన సమాధానం తన హృదయాన్ని ద్రవింపచేసిందన్నారు రామ్చరణ్. ఈ దర్శకహీరోల మూడేళ్ల స్వప్నం ‘ఆర్ఆర్ఆర్’ ఈ నెల 25న వెండితెరపై ఆవిష్కృతంకానుంది. ఈ సందర్భంగా చిత్ర కథానాయకులు ఎన్టీఆర్, రామ్చరణ్, దర్శకుడు రాజమౌళి మంగళవారం పాత్రికేయులతో ప్రత్యేకంగా సంభాషించారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా అనుభవాల్ని పంచుకున్నారు..
ఎన్టీఆర్, రామ్చరణ్ల వ్యక్తిగత ఛరిష్మా, స్టార్డమ్ కంటే ఇతర ఏ అంశాల ప్రాతిపదికగా వారిని ఈ కథలో హీరోలుగా ఎంచుకున్నారు?
రాజమౌళి: నేను రాసుకున్న రామ్, భీమ్ అనే ఇద్దరు ధీరోదాత్తులైన వీరయోధుల కథకు ఎన్టీఆర్, రామ్చరణ్ మాత్రమే న్యాయం చేయగలరని అనుకున్నా. ఇద్దరు హీరోల అభినయపటిమ, తిరుగులేని ఫాలోయింగ్తో పాటు నిజ జీవితంలో వారి మధ్య పెనవేసుకుపోయిన స్నేహబంధం కూడా తెరపై పాత్రల్లో ప్రతిఫలిస్తుందనే విశ్వాసంతో హీరోలుగా ఎంపిక చేసుకున్నా.‘ఆర్ఆర్ఆర్’ సినిమా కంటే ముందే సుదీర్ఘకాలంగా తారక్, చరణ్ మంచి మిత్రులుగా ఉన్నారు. వాళ్ల స్నేహంలోని గాఢత సినిమాలోని ప్రతి ఫ్రేమ్లో ప్రతిఫలిస్తుంది.
ప్రస్తుతం ఉక్రెయిన్ యుద్ధ సంక్షోభంలో చిక్కుకుంది. అక్కడ షూటింగ్ చేసిన అనుభవాలు ఎలా ఉన్నాయి?
రాజమౌళి: ఈ సినిమాలో కొంతభాగాన్ని ఉక్రెయిన్లో చిత్రీకరణ జరిపాం. రాజకీయ అలజడి లేని ప్రశాంత పరిస్థితుల్లో షూటింగ్ చేశాం కాబట్టి మాకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదు. మా టీమ్తో కలిసి పనిచేసిన అక్కడి కొందరు మిత్రులను ఫోన్లో పలకరించాను. వారు చెబుతున్న మాటలు విని హృదయం ముక్కలైపోయింది.
ఎన్టీఆర్: ఉక్రెయిన్ ప్రజలు స్వతహాగా సౌమ్యులు, సహృదయులు. ఇతరుల సంస్కృతిని త్వరగా ఆకళింపు చేసుకుంటారు. వృత్తిపరంగా బాధ్యతతో ప్రవర్తిస్తారు. యుద్ధం ముగిసి త్వరలో అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొనాలని ఆకాంక్షిస్తున్నా.
రామ్చరణ్: ఉక్రెయిన్లో చాలా పెద్ద షెడ్యూల్ చేశాం. అక్కడి ప్రజల ఆతిథ్యం, సేవాగుణం మమ్మల్ని కట్టిపడేసింది. షూటింగ్ టైంలో నాకు సెక్యూరిటీగా పనిచేసిన యువకుడితో ఈ మధ్యే మాట్లాడాను. ఎనభైఏళ్ల్ల వయసున్న తన తండ్రి కూడా తుపాకీ చేతబూని వీధుల్లో యుద్ధానికి వెళ్తున్నాడని చెప్పాడతను. నా సహాయం కోరగా అతనికి కొంత డబ్బు కూడా పంపించాను.
రామ్, భీమ్ పాత్రల్ని రాసుకున్నప్పుడు వారి వ్యక్తిత్వాలకు ఎలాంటి గుణాల్ని ఆపాదించారు?
రాజమౌళి: రామ్ అగ్నినైనా గుండెల్లో దాచుకునే స్థితప్రజ్ఞత కలిగి ఉంటాడు. చరణ్లో నాకు ఆ లక్షణం ఎక్కువగా కనిపిస్తుంది. పరిస్థితుల్ని యథాతథంగా స్వీకరిస్తాడు. కష్టనష్టాలకు ఏమాత్రం తొణకడు. సుఖదుఃఖాల్లో స్థ్ధిరచిత్తాన్ని ప్రదర్శిస్తాడు. ఈ లక్షణాలన్నీ ఉన్నాయి కాబట్టి రామ్ పాత్రకు చరణ్ చక్కగా సరిపోతాడనిపించింది. ఇక భీమ్ అమాయకత్వం, ధైర్యం కలబోసిన వ్యక్తిగా కనిపిస్తాడు. ఎన్టీఆర్కు ఆ పాత్ర పర్ఫెక్ట్గా సెట్ అయింది.
షూటింగ్ సందర్భంగా మరచిపోలేని జ్ఞాపకాల గురించి..?
ఎన్టీఆర్: ప్రతి రోజు ఓ మధురజ్ఞాపకమని చెప్పొచ్చు. ఏవో కొత్త విషయాల్ని నేర్చుకోవడం..అల్లరి, సరదాలు..రాజమౌళిగారితో అప్పుడప్పుడు తిట్లు తింటూ షూటింగ్ ఆసాంతం గొప్ప జ్ఞాపకాల పుస్తకంలా మిగిలిపోయింది. ఇంటర్వెల్ ఎపిసోడ్ను అరవై రాత్రులు షూట్ చేశాం. అది సినిమాలోనే ప్రత్యేకాకర్షణగా నిలుస్తుంది.
ఈ సినిమాకు ముందు ఏమైనా వర్క్షాప్లు నిర్వహించారా?
రామ్చరణ్: పెద్దగా వర్క్షాప్లేవీ నిర్వహించలేదు. మా పాత్ర తాలూకు స్వభావం, తీరుతెన్నుల గురించి కొద్దిరోజులు చర్చించామంతే. రాజమౌళిగారు మాత్రం చాలా వర్క్ చేశారు. ప్రతి పాత్రను ఓ శిల్పిలా అద్భుతంగా మలిచాడు.
ఇద్దరు స్టార్హీరోలున్నారు కాబట్టి పాత్ర ప్రాధాన్యతల్ని ఎలా బ్యాలెన్స్ చేశారు?
రాజమౌళి: సాధారణంగా ఇద్దరు స్టార్హీరోల సినిమా అనగానే స్క్రీన్స్పేస్, ఫైట్స్…ఇలాంటివన్నీ సమానంగా ఉండాలనుకుంటారు. ఈ సినిమా విషయంలో నేను ఆ లెక్కల్ని వేసుకోలేదు. ఇద్దరు హీరోల పాత్రలు..వారు పలికించే భావోద్వేగాలతో ప్రేక్షకులు సహానుభూతి చెందాలి. అలా ఫీల్కానీ పక్షంలో నా కథ ఫెయిల్ అవుతుందనుకున్నా. ఎమోషన్స్ విషయంలో మాత్రం ఫర్ఫెక్ట్గా బ్యాలెన్స్ ఉండేలా చూసుకున్నా. ఇద్దరు హీరోల ఉపోద్ఘాత ఘట్టాలు పూర్తవగానే ప్రేక్షకులు వారి పాత్రలతో వెంటనే కనెక్ట్ అయిపోతారు. ఇమేజ్లపై ఎక్కువగా దృష్టిపెడితే ఓ హృదయం లేని సినిమా తీసిన భావన కలుగుతుంది.
ఎన్టీఆర్: తెరపై ఇద్దరు హీరోల్ని కలిపి చూడబోతున్నామని అభిమానులు మానసికంగా సిద్ధమైపోయారు. హీరోలు, ఇమేజ్ల లెక్కల గురించి ఆలోచించే రోజులెప్పుడో పోయాయి. వాటన్నింటిని దాటేసి తెలుగు సినిమా చాలా ముందుకువచ్చిందని భావిస్తున్నా.
కరోనా వల్ల సినిమా చాలా ఆలస్యమైంది. దాని ప్రభావం బడ్జెట్పై ఎంత మేరకు పడింది? ‘బాహుబలి’ తర్వాత మీ నుంచి వస్తోన్న సినిమాగా ఏమైనా ఒత్తిడికి లోనయ్యారా?
రాజమౌళి: కరోనా మూలంగా మేము మాత్రమే కాదు..యావత్ ప్రపంచం కష్టాల్లో చిక్కుకుంది. అన్ని రంగాలు ప్రభావితమయ్యాయి. మా సినిమా బడ్జెట్ కూడా బాగా పెరిగింది. స్క్రిప్ట్లో అనుకున్న విధంగా సినిమాను దృశ్యమానం చేయగలనా? లేదా? అనే ఒక్క భయం మాత్రమే షూటింగ్ సమయంలో నన్ను వెంటాడింది. వాస్తవం చెప్పాలంటే ఆ భయమే పరిపూర్ణంగా సినిమాలు తీయడానికి నాకు చోదక శక్తిగా పనిచేస్తున్నది.
కరోనా వల్ల వచ్చిన గ్యాప్ సినిమా ఇంకా ఉన్నతంగా రావడానికి ఏమైనా దోహదం చేసిందా?
రాజమౌళి: ప్రతి సంక్షోభంలోనూ ఓ సానుకూలాంశం ఉంటుంది. లాక్డౌన్ విరామంలో సినిమా చూసినప్పుడు ఎక్కడ బెటర్మెంట్ చేస్తే బాగుంటుందో తెలిసొచ్చింది. థర్ట్వేవ్ టైమ్కే షూటింగ్ మొత్తం పూర్తయింది కాబట్టి త్రీడీ వెర్షన్ బాగా వచ్చేలా దృష్టిపెట్టాం. వాస్తవానికి నేను త్రీడీ ఫార్మాట్కు వ్యతిరేకం. కానీ ఈ సినిమాలో రామ్, భీమ్ క్యారెక్టర్స్ ప్రేక్షకులకు మరింతగా కనెక్ట్ కావాలంటే త్రీడీ అవసరమని భావించాం.
చారిత్రక కథాంశం కాబట్టి స్క్రిప్ట్పరంగా వివాదాలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?
రాజమౌళి: నేను ఇదివరకే చెప్పినట్లు ఈ సినిమా అల్లూరి సీతారామారాజు, కొమురం భీం జీవిత చరిత్ర కాదు. పూర్తి కాల్పనిక కథాంశం. ఆ ఇద్దరి యోధుల మూల చరిత్రకు ఊహాత్మక ఘటనల్ని జోడించి ఈ కథ రాసుకున్నా. ఒకవేళ నిజంగా చారిత్రక కథను తీస్తే అప్పుడు వివాదాల గురించి ఆలోచించాలి.
ఈ సినిమా షూటింగ్ టైమ్లో ఎప్పుడైనా రామ్, భీమ్ పాత్రల్ని పరస్పరం మార్చుకుంటే బాగుండేది కదా అనుకున్నారా?
ఎన్టీఆర్: అలాంటిదేమీ లేదు. మా ఇద్దరి పాత్రల్ని రాజమౌళిగారు పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు. మేమిద్దరం మంచి ఆకలితో మా పాత్రలకు న్యాయం చేశాం. రాజమౌళి స్వప్నాల్ని సాకారం చేయడానికి నేను, చరణ్ ఇద్దరం శ్రమించాం.
‘బాహుబలి’ తర్వాత ప్రతి భారతీయ చిత్రాన్ని దానితో పోల్చిచూస్తున్నారు. మీ దృష్టిలో ‘ఆర్ఆర్ఆర్’ బిగ్గర్ దేన్ బాహుబలి అవుతుందనుకుంటున్నారా?
రాజమౌళి: ‘ఆర్ఆర్ఆర్ గోయింగ్ టు బి బిగ్గర్ దేన్ బాహుబలి..?’ అని మీరడిగిన ప్రశ్నలోనే సమాధానం వచ్చేసింది (నవ్వుతూ). ఇంకా దీని గురించి ఎక్కువ ప్రశ్నలు అడగొద్దు.
ఈ సినిమాలో అలియాభట్ను కథానాయికగా ఎంచుకోవడానికి కారణమేమిటి?
మేము రాసుకున్న సీత పాత్రకు అలియాభట్ అయితేనే బాగుంటుందనిపించింది. ఆమె ముఖంలో అమాయకత్వం బాగా నచ్చింది. అదే సమయంలో నీరు, నిప్పు వంటి ఇద్దరు వీరుల పాత్రల్ని కట్టడి చేసే ధీశాలి అయిన మహిళగా కనిపించాలి. ఈ లక్షణాలన్నీ అలియాభట్లో ఉన్నాయనిపించింది. అందుకే ఆమెను ఎంచుకున్నాం.
భారతీయ సినిమాలో ‘ఆర్ఆర్ఆర్’ ఓ బెంచ్మార్క్ క్రియేట్ చేస్తుందని భావిస్తున్నారా?
నా ఇరవైఏళ్ల కెరీర్లో సినిమా రికార్డుల గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. అలాంటి మాటలు చెప్పడం నాకు ఇష్టం ఉండదు. సినిమాల విషయంలో నేను అనుకున్న ఉద్వేగాలు తెరపై సంపూర్ణంగా ఆవిష్కృతం అయ్యాయా? లేదా? అనే విషయం గురించే ఎక్కువగా ఆలోచిస్తా. ప్రేక్షకులు ఆ ఎమోషన్స్తో సహానుభూతి చెందితే సినిమా విజయం తథ్యమని నమ్ముతా. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా అలాంటి అనుభూతి నందిస్తుందని భావిస్తున్నా.
‘ఆర్ఆర్ఆర్’ గ్లోబల్ సినిమా అని అభివర్ణిస్తున్నారు. ఈ విషయంలో మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి?
రాజమౌళి: గ్లోబల్ సినిమా అని మనకు మనమే ప్రకటించుకోవద్దు. ప్రపంచవ్యాప్తంగా ఇండియన్స్ ఉన్నారు కాబట్టి మన సినిమాల్ని చూస్తున్నారు. అంతమాత్రాన అది గ్లోబల్ మూవీ అనిపించుకోదు. విదేశీయులు కూడా మన సినిమాల్ని చూసినప్పుడు మాత్రమే గ్లోబల్ మూవీ అనిపించుకుంటుంది. ‘బాహుబలి’ సినిమాను జపాన్లోని కొంత మంది చూశారు. ఆ విషయంలో గొప్పగా ఫీలవుతా. ఆ సినిమాలోని ఎమోషన్స్తో జపనీస్ వాళ్లు బాగా కనెక్ట్ అయ్యారు. మన ఇండియన్స్ ఎమోషన్స్ను విదేశీయులు కూడా అర్థం చేసుకున్నారని ‘బాహుబలి’తో అర్థమైంది. ‘ఆర్ఆర్ఆర్’ కూడా ఆ స్థాయిలో విదేశీయుల్ని మెప్పిస్తే సంతోషిస్తా.
రాజమౌళిగారు దర్శకుడు కాకుంటే మీరీ సినిమా చేసేవారా?
రామ్చరణ్: అలా ఆలోచించే అవకాశం, అవసరం ఎప్పుడూ రాలేదు.
ఎన్టీఆర్: ఇలాంటి కథను ఎవరూ ఊహించలేరు. మరే దర్శకుడు కూడా రాయలేరు. రాజమౌళి, చరణ్ లేకపోతే నేను ఈ సినిమా చేసేవాడిని కాదు. మీరందరూ ఓ విషయంలో ఫిక్సైపోవాలి. అదేమిటంటే..ఇక నుంచి తెలుగులో మల్టీస్టారర్స్ వస్తూనే ఉంటాయి. సమకాలీన తెలుగు సినిమా మరో ప్లేన్లోకి వెళ్లిపోయింది.
అల్లూరి, కొమురం భీం పాత్రలకు ఏమైనా రెఫరెన్స్ తీసుకున్నారా?
ఎన్టీఆర్: ఎలాంటి రిఫరెన్స్ తీసుకోలేదు. రాజమౌళి కథ చెప్పగానే నేను భీమ్ పాత్రతో కనెక్ట్ అయిపోయా. ఆయన ఇచ్చిన సూచనల ప్రకారం నటించా. ముందే చెప్పినట్లు ఇదొక ఫిక్షనల్ కథ కాబట్టి చరిత్రకు సంబంధించిన ఎక్కువ బరువుల్ని ఎత్తుకోలేదు. పాత్రల అవసరం మేరకే హిస్టరీ ఎలిమెంట్స్ గురించి తెలుసుకున్నాం. నా దృష్టిలో పాత్రలపరంగా రెఫరెన్స్ లేకుండా ఉండటమే మంచిది. అలా ఉంటే ఎక్కడో ఓ చోట ఆగిపోతాం.
రామ్చరణ్: ఇది బయోపిక్ కాదు కాబట్టి రెఫరెన్స్ తీసుకోవాల్సిన అవసరం రాలేదు.