సంక్రాంతికి రావలసిన ‘‘ఆర్ఆర్ఆర్’’ సినిమా ఆగిపోయింది. కానీ దీన్ని చుట్టుముడుతున్న వివాదాలు మాత్రం ఆగడం లేదు. అప్పుడెప్పుడో పాత్రల ఫస్ట్ లుక్లు వచ్చినప్పటి నుంచి ఎవరో ఒకరు ఏదో ఒక విషయంపై వివాదం రేపుతూనే ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ముస్లిం గెటప్లో కనిపించినప్పుడు ఈ వివాదాలు మొదలయ్యాయి.
ఈ క్రమంలోనే ఇప్పుడు అసలు ఈ సినిమా కథే తప్పంటూ మరో వ్యక్తి కేసు వేశాడు. ఏకంగా ఏపీ హైకోర్టుకు వెళ్లి మరీ.. సినిమాకు వ్యతిరేకంగా పిటిషన్ వేశాడు. ఆయనే అల్లూరి సీతారామరాజు యువజన సంఘం అధ్యక్షుడు వీరభద్రరావు. చరిత్రని వక్రీకరిస్తుంటే చూస్తూ ఊరుకోమని.. కచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన వార్నింగ్ ఇచ్చాడు.
అంతేకాదు చరిత్రను వక్రీకరించే సన్నివేశాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాజమౌళిని కోరుతున్నాడు. కేవలం డబ్బుల కోసం కమర్షియల్ పేరుతో స్వతంత్ర సమరయోధుల జీవితాలని ఇష్టం వచ్చినట్లు వాడుకుంటే చూస్తూ ఊరుకోమని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు వీరభద్రారావు.
అల్లూరి సీతారామరాజు 1897లో విశాఖపట్టణం పాండ్రంకిలో పుట్టాడని.. కొయ్యూరు మండలం రాజేంద్రపాలెంలో 1924 మే 7న తెల్లవారి కాల్పుల్లో వీరమరణం పొందారని తెలిపాడు. అదే సమయంలో కొమురం భీం 1901లో జన్మించి 1941లో మరణించారని చరిత్ర చెబుతోందని వీరభద్రరావు తెలిపారు.
ఇద్దరు కలిసినట్లు చరిత్రలో ఎక్కడా లేదని.. చరిత్రలో లేని విషయాలను సినిమాలో ఎలా చూపిస్తారని ప్రశ్నిస్తున్నాడు. మరోవైపు రాజమౌళి మాత్రం ఇది పూర్తిగా కల్పితం అని.. 1920 ప్రాంతంలో ఒకవేళ ఇద్దరూ కలిసి ఉంటే ఎలా ఉండేది అనేది సినిమా కథ అంటున్నాడు. మొత్తానికి రాజమౌళి మల్టీస్టారర్ పై కూడా వివాదాలు మొదలయ్యాయి.