“ప్రతినిధి-2’ వ్యవస్థను ప్రశ్నించే నిజాయితీపరుడైన జర్నలిస్ట్ కథ. కలం వీరులకు నివాళిగా ఈ సినిమాను తెరకెక్కించాను. ఇందులో ఏ రాజకీయ పార్టీని టార్గెట్ చేయలేదు’ అన్నారు సీనియర్ జర్నలిస్ట్ మూర్తి దేవగుప్తాపు. ఆయన దర్శకుడిగా పరిచయమవుతూ నారా రోహిత్ హీరోగా తెరకెక్కించిన చిత్రం ‘ప్రతినిధి-2’ ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మూర్తి దేవగుప్తాపు మాట్లాడుతూ ‘నాకు కాలేజీ రోజుల నుంచే సినిమాలపై ఆసక్తి ఉంది. అప్పుడు నాటకాలు వేసేవాళ్లం. అలాగే పుస్తకాలు బాగా చదవడం, కథలు రాసే అలవాటు ఉండటం వల్ల సినిమా రంగంపై ఆసక్తి పెరిగింది. దర్శకత్వం తాలూకు మెళకువలను నేర్చుకోవడంతో పాటు ఎంతో రీసెర్చ్ చేసి ఈ సినిమాను మొదలుపెట్టాను’ అన్నారు.
ఈ సినిమాలో హీరో జర్నలిస్ట్ పాత్రలో నీతి, నిజాయితీలకు ప్రతిరూపంగా కనిపిస్తాడని, నమ్మిన సిద్ధాంతాల కోసం పోరాడుతాడని, పాత్రికేయులను హీరోలుగా చూపించాలనే గొప్ప ఉద్దేశ్యంతో ఈ సినిమా చేశానని ఆయన తెలిపారు. ‘ఈ సినిమాలో హీరో చాలా పెద్ద ఇష్యూని డీల్ చేస్తాడు. వ్యవస్థను ప్రశ్నించడంతో పాటు దానిని సంస్కరించే బాధ్యతను కూడా తీసుకుంటాడు. ఇది ప్రాపగాండ మూవీ అసలే కాదు. ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా తీయలేదు. ప్రస్తుతం రాజకీయాల గురించి, ప్రజల భావజాలం గురించి ఈ సినిమాలో లోతుగా చర్చించాం’ అని మూర్తి దేవగుప్తాపు అన్నారు. తన దగ్గర నాలుగు కథలు సిద్ధంగా ఉన్నాయని, సినిమా పట్ల పాషన్ను ఇక ముందు కూడా కొనసాగిస్తానని మూర్తి దేవగుప్తాపు పేర్కొన్నారు.