కన్నడ సొగసరి, నేషనల్ క్రష్ రష్మిక మందన్న తాజాగా విడుదలైన ‘యానిమల్’ చిత్రంలో తన అద్భుతమైన నటనతో అందరి ప్రశంసలందుకుంటున్నది. రణ్బీర్కపూర్ కథానాయకుడిగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి పాన్ ఇండియా స్థాయిలో మంచి వసూళ్లు దక్కుతున్నాయి. ముఖ్యంగా రష్మిక మందన్న కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ కనబరిచిందని, ప్రియురాలిగా..భార్యగా ఆమె అభినయం చాలా గొప్పగా ఉందని సోషల్ మీడియాలో పొగడ్తలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని సన్నివేశాల్లో హీరో రణ్బీర్కపూర్ను మించిపోయిందని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో ఈ సినిమా కోసం రష్మిక తీసుకున్న పారితోషికం గురించి ఆసక్తికరమైన చర్చ నడుస్తున్నది. ఈ పాన్ ఇండియా చిత్రానికి రష్మిక దాదాపు 7 కోట్ల పారితోషికం తీసుకుందని తెలిసింది. అయితే సినిమాలో ఆమె పర్ఫార్మెన్స్కు ఫిదా అయిన అభిమానులు మాత్రం రష్మికకు ఎంత పారితోషికం ఇచ్చినా తక్కువే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ‘పుష్ప’ తర్వాత రష్మిక మరోసారి పాన్ ఇండియా రేంజ్లో సత్తా చాటిందని ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.