ఇటీవల విడుదలైన ‘యానిమల్’ చిత్రంలో సంప్రదాయ గృహిణి గీతాంజలి పాత్రలో చక్కటి అభినయంతో ప్రేక్షకుల్ని మెప్పించింది కన్నడ సోయగం రష్మిక మందన్న. హీరో రణభీర్కపూర్తో పోటాపోటీగా ఆమె నటన సాగిందని ప్రశంసలొచ్చాయి. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా షూటింగ్ తాలూకు అనుభవాలను పంచుకుంది రష్మిక మందన్న. సినిమాల విషయంలో దర్శకుడు సందీప్రెడ్డి వంగా విజన్ చూసి షాకయ్యానని, రణభీర్కపూర్ను కొట్టే సన్నివేశం సవాలుగా అనిపించిందని చెప్పింది.
ఆమె మాట్లాడుతూ ‘ఒకే ఒక్క టేక్లో ఆ సీన్ పూర్తి చేశాం. ఆ సన్నివేశంలో భావోద్వేగాలు బలంగా పండాలని దర్శకుడు సందీప్ రెడ్డి చెప్పారు. చాలా సహజంగా సీన్ రావాలన్నారు. రణభీర్ను బాగా కోప్పడుతూ చెంపపై గట్టిగా కొట్టాను. షాట్ ఓకే అని చెప్పినా నా కన్నీళ్లు ఆగలేదు. అంతలా ఆ సీన్లో ఇన్వాల్వ్ అయ్యాను’ అని చెప్పింది. ‘పుష్ప-2’ చిత్రం కూడా అద్భుతంగా రూపుదిద్దుకుంటున్నదని, తన పాత్ర మొదటిభాగం కంటే చాలా ఉన్నతంగా ఉంటుందని రష్మిక మందన్న పేర్కొంది.