Rashmika Mandanna | సినిమా సెట్స్ నుంచి లీకైన ఫొటోలను షేర్ చేయడం మంచి పద్దతి కాదని, అలా చేయడం వల్ల సినిమాపై ఆసక్తి తగ్గిపోతుందని చెప్పింది అగ్ర కథానాయిక రష్మిక మందన్న. ప్రస్తుతం ఈ భామ ‘పుష్ప-2’లో అల్లు అర్జున్ సరసన నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ నుంచి హీరో అల్లు అర్జున్కు సంబంధించిన స్టిల్ ఒకటి బయటికొచ్చింది. ఈ విషయంపై రష్మిక అసంతృప్తిని వ్యక్తం చేసింది.
ఆమె మాట్లాడుతూ ‘సినిమా కోసం కొన్ని వందల మంది కష్టపడి పనిచేస్తారు. లీకైన ఫొటోలను సోషల్మీడియాలో షేర్ చేయడం ఏమాత్రం భావ్యం కాదు. ‘పుష్ప-2’పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ప్రేక్షకులకు గొప్ప థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అందించడానికి టీమ్ అంతా కృషి చేస్తున్నది’ అని చెప్పింది. ‘పుష్ప’ చిత్రంలో రష్మిక మందన్న పోషించిన శ్రీవల్లి పాత్రకు మంచి గుర్తింపు లభించింది. ఆమెను పాన్ ఇండియా తారగా నిలిపింది. ఈ నేపథ్యంలో ‘పుష్ప-2’లో రష్మిక పాత్ర ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఆగస్ట్ 15న ఈ చిత్రం
ప్రేక్షకుల ముందుకురానుంది.