కాజీపేట, మే 3: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్( జీడబ్ల్యూఎంసీ) ఎన్నికల్లో కాజీపేట పరిధిలో టీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందారు. దీంతో కార్యకర్తల్లో హేషారు నెలకొంది. పట్టణ పరిధిలోని ఎనిమిది డివిజన్లకు ఆరు డివిజన్ల్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఘన విజయాన్ని సాధించి గులాబీ జెండాను ఎగురవేయడంతో కార్యకర్తలు సంబురాల్లో మునిగిపోయారు. మండల పరిధిలో గులాబీ జెండాను ఎగురవేసిన వారిలో దాదాపు సగం మందికి పైగా తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా భాగస్వాములు కావడం విశేషం. 45వ డివిజన్ నుంచి ఇండ్ల నాగేశ్వర్రావు, 47వ డివిజన్ నుంచి సంకు నర్సింగరావు, 48వ డివిజన్ నుంచి డాక్టర్ షర్తాజ్ బేగం, 61వ డివిజన్ నుంచి ఎలకంటి రాములు, 46వ డివిజన్ నుంచి మునిగాల సరోజన, 64వ డివిజన్ నుంచి ఆవాల రాధికారెడ్డి విజయాన్ని అందుకున్నారు. 62, 63 విడిజన్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు జక్కు ల రవీందర్, యెలిగేటి విజయశ్రీ విజయం సాధించారు.