గత ఏడాది పలువురు అగ్ర కథానాయికలు డీప్ఫేక్ వీడియోల బారిన పడటం చర్చనీయాంశంగా మారింది. సాంకేతికతను ఉపయోగించి తారలను అభ్యంతరకరంగా చూపించడం ఇండస్ట్రీని కలవరపెట్టింది. రష్మిక మందన్న, ప్రియాంక చోప్రా, అలియాభట్లను లక్ష్యంగా చేసుకొని సృష్టించిన డీప్ఫేక్ వీడియోలు సోషల్మీడియాలో వైరల్గా మారాయి. రష్మిక మందన్న డీప్ఫేక్ వీడియోలను రూపొందించిన నిందితున్ని పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. ఈ విషయపై గత కొద్దిరోజులుగా తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న రష్మిక మందన్న తాజాగా మరోసారి స్పందించింది.
తొలుత ఈ డీప్ఫేక్ వీడియోల గురించి స్పందించాలా? వొద్దా అనే సందిగ్ధంలో ఉన్నానని, మహిళల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ముందుకొచ్చానని చెప్పింది. ‘ఇదే సంఘటన నా కాలేజీ రోజుల్లో జరిగితే బయటకు చెప్పడానికి భయపడేదాన్ని. ఎందుకంటే ఇలాంటి విషయాలపై మాట్లాడితే సమాజం ఎలా స్వీకరిస్తూందోనని భయం. నా సోషల్మీడియా ఖాతాల్లో 41 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. ఆ వీడియో గురించి మాట్లాడితే వారంతా రకరకాలుగా రియాక్ట్ అవుతారని భయపడ్డాను. కానీ ఎవరేమనుకున్నా అమ్మాయిల్లో ధైర్యం నింపాలనే లక్ష్యంతో స్పందించాను. ఇలాంటి వీడియోలు మహిళల భావోద్వేగాలను ప్రభావితం చేస్తాయి. మానసిక వేదనకు గురిచేస్తాయి’ అని రష్మిక మందన్న చెప్పింది.