Rashmika Mandanna | కన్నడ కస్తూరి రష్మిక మందన్న చేతిలో ప్రస్తుతం ఆరు భారీ చిత్రాలున్నాయి. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఈ అమ్మడు దూసుకుపోతున్నది. కెరీర్లో ఇప్పటివరకు ఎక్కువగా వాణిజ్య చిత్రాల్లో భాగమైన ఈ భామ తొలిసారి ఓ మహిళా ప్రధాన చిత్రంలో నటించబోతున్నట్లు తెలిసింది. రాహుల్ రవీంద్రన్ దర్శకుడు. గీతా ఆర్ట్స్, జీఏ2 సంస్థలు నిర్మించనున్నాయని తెలిసింది. చిలసౌ, మన్మథుడు-2 తర్వాత రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాతో మరలా మెగాఫోన్ పట్టబోతున్నారు.
ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన కథా చర్చలు పూర్తయ్యాయని, కథలోని కొత్తదనం నచ్చడంతో రష్మిక మందన్న వెంటనే ఈ సినిమాకు ఓకే చెప్పిందని అంటున్నారు. ఓ వైపు భారీ కమర్షియల్ సినిమాల్లో బిజీగా ఉంటూనే, మరోవైపు కెరీర్పరంగా ప్రయోగాలకు సిద్ధమవుతున్నది రష్మిక మందన్న. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రానుందని తెలిసింది. ప్రస్తుతం రష్మిక మందన్న తెలుగులో పుష్ప-2, రెయిన్బో చిత్రాలతో పాటు విజయ్ దేవరకొండ సరసన ఓ సినిమాలో నటిస్తున్నది.