Sai Pallavi | రణ్బీర్ రాముడిగా ఎలా ఉంటాడు? సీతామహాసాద్విగా సాయిపల్లవి నప్పుతుందా?.. నితేశ్ తివారి ‘రామాయణ్’ ప్రకటించిన నాటి నుంచీ ప్రేక్షకుల్లో తలెత్తున్న ప్రశ్నలివి. వాటికి సమాధానాలు దొరికేశాయి. ఇటీవలే షూటింగ్ మొదలైన ఈ సినిమాకు సంబంధించిన స్టిల్స్ సామాజిక మాధ్యమాల్లో అనుకోకుండా ప్రత్యక్షమయ్యాయి. వాటిని చూసి నెటిజన్లు సంబరపడిపోతుంటే.. సినీవర్గాలు మాత్రం ఆశ్చర్యపోతున్నాయి. అధికార ప్రకటన రాకుండానే ఏకంగా ఫోటోలు లీకవడంపై ‘రామాయణ్’ చిత్ర యూనిట్ విస్మయానికి లోనైంది.
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఫొటోలు లీకు కావడంతో చిత్రయూనిట్ తలలు పట్టుకున్నారు. దాంతో లొకేషన్లో ఆంక్షలు కఠితరం చేశారట. ఇక ఫొటోల విషయానికొస్తే సీతారాములుగా రణ్బీర్, సాయిపల్లవి అద్భుతంగా కుదిరారు. ఆయోధ్య నగరశోభ, అంతఃపురాలు, వాటిమధ్య సీతారాములుగా నడిచివస్తున్న రణ్బీర్, సాయిపల్లవిలను చూస్తుంటే రెండు కళ్లూ చాలడంలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ముఖ్యంగా సీతమ్మగా సాయిపల్లవిని చూస్తుంటే ఎంత ముచ్చటగా ఉందో.. మూడు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ రామాయణంలో రావణుడిగా ‘కేజీఎఫ్’ ఫేం యష్ నటిస్తున్న విషయం తెలిసిందే. మండోదరిగా రకుల్, లక్ష్మణుడిగా నవీన్ పోలిశెట్టి కనిపించనున్నట్టు సమాచారం. బాలకాండ, అయోధ్యకాండ తొలి భాగంలోనూ, అరణ్యకాండ, కిష్కిందకాండ రెండో భాగంలోనూ, యుద్ధకాండ మూడో భాగంలోనూ నితేశ్ తెరకెక్కించనున్నారని తెలిసింది. వచ్చే ఏడాది దీపావళికి తొలి పార్ట్ విడుదల కానుందట.