Ranabaali | టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారిన జంట విజయ్ దేవరకొండ-రష్మిక ఇటీవలే వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఉదయ్పూర్లో అత్యంత వైభవంగా వీరి పెళ్లి వేడుకలు జరగగా, మార్చి 4న హైదరాబాద్లో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించనున్నారు. ఈ వేడుకకు టాలీవుడ్ ప్రముఖులు భారీగా హాజరుకానున్నట్లు సమాచారం. రిసెప్షన్తో వివాహ కార్యక్రమాలు పూర్తి కానున్నాయి. వివాహ వేడుకల అనంతరం నూతన దంపతులు హనీమూన్ కోసం విదేశాలకు వెళ్లాలని భావిస్తున్నారట. ప్రస్తుతం అంతర్జాతీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని దుబాయ్ వంటి దేశాల కంటే జపాన్ లేదా మాల్దీవులు వంటి ప్రదేశాలను ఎంపిక చేసుకునే అవకాశముందని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే వీరి విదేశీ ట్రిప్ మార్చి 20లోగా ముగించాల్సి ఉంటుంది. ఎందుకంటే అదే తేదీ నుంచి ‘రణబాలి’ షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది.
వివాహం కారణంగా ‘రణబాలి’ చిత్రీకరణకు తాత్కాలిక విరామం ఇచ్చారు. హీరో–హీరోయిన్లతో సంబంధం లేని కొన్ని సన్నివేశాలను మాత్రమే ఈ మధ్య చిత్రీకరించారు. కానీ కథలో కీలక భాగం విజయ్–రష్మికలపై ఆధారపడటంతో అసలు షూటింగ్ ఇప్పుడు మొదలవుతోంది. దర్శకుడు రాహుల్ సంకృత్యయాన్ మార్చి 20 నుంచి ప్రారంభమయ్యే షెడ్యూల్ కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తోంది. ఇది చిత్రానికి కీలకమైన భారీ షెడ్యూల్గా చెబుతున్నారు. ముఖ్యంగా యాక్షన్ మరియు ఎమోషనల్ సన్నివేశాలను ఈ దశలో తెరకెక్కించనున్నారట. సమ్మర్ తీవ్రత దృష్ట్యా హైదరాబాద్లో కాకుండా చల్లని వాతావరణం ఉన్న ప్రదేశాల్లో షూటింగ్ నిర్వహించే ఆలోచనలో యూనిట్ ఉందని సమాచారం. కథ బ్రిటీష్ ఇండియా నేపథ్యంలో సాగుతుండటంతో భారీ సెట్ల అవసరం ఉంది. అందుకే ప్రత్యేక ఆర్ట్ డిజైన్తో దేశంలోనే కొన్ని శీతల ప్రాంతాల్లో సెట్లు వేసి చిత్రీకరణ పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటివరకు విదేశాల్లో షూటింగ్ చేయలేదు.
‘రణబాలి’తో పాటు విజయ్ ‘రౌడీ జనార్దన్’ చిత్రాన్ని కూడా త్వరగా పూర్తి చేయాల్సి ఉంది. ఆ సినిమా ముందుగా విడుదలకు రావాల్సి ఉండటంతో రెండు ప్రాజెక్టులను బ్యాలెన్స్ చేసుకుంటూ పూర్తి చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక రష్మిక కూడా బిజీగానే ఉంది. ‘రణబాలి’తో పాటు ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘మైసా’ షూటింగ్ కొనసాగుతోంది. అదేవిధంగా బాలీవుడ్లో ‘కాక్టెయిల్ 2’లోనూ నటిస్తోంది. మరికొన్ని కొత్త సినిమాలకి కూడా కమిట్ అయినట్టు తెలుస్తుంది.