రానా, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘విరాట పర్వం’. వేణు ఊడుగుల దర్శకుడు. 1990 దశకంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో కామ్రేడ్ రవన్నగా రానా నటిస్తున్నారు. ఆయన్ని ఆరాధించే అమ్మాయి వెన్నెలగా సాయిపల్లవి కనిపించనుంది. మంగళవారం రానా పుట్టినరోజు సందర్భంగా ఓ వీడియోను విడుదల చేశారు. ‘మారదులే..ఈ దోపిడి దొంగల రాజ్యం మారదులే..రౌద్రపు శత్రువు దాడిని ఎదురించే పోరాటం మనదే..ఛలో ఛలో పరిగెత్తు..అడుగే పిడుగై రాలేలా..గుండెల దమ్ముని చూపించు’ అంటూ రానా చెప్పిన సంభాషణలు ఆకట్టుకునేలా ఉన్నాయి. సంక్రాంతికి ట్రైలర్ను విడుదల చేయబోతున్నారు. చిత్రీకరణ పూర్తయిందని, ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి కెమెరా: డానీ సాంచేజ్ లొపేజ్, దివాకర్ మణి, సంగీతం: సురేష్ బొబ్బిలి, నిర్మాణ సంస్థలు: సురేష్ ప్రొడక్షన్స్, శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, రచన-దర్శకత్వం: వేణు ఊడుగుల.