కంచె, ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు, ‘అ’ వంటి చిత్రాలకు ఆర్ట్ డైరెక్టర్గా పనిచేసి చక్కటి ప్రతిభతో మెప్పించారు సాహి సురేష్. ప్రస్తుతం ఆయన రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రానికి కళా దర్శకత్వం వహించారు. శరత్ మండవ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 29న విడుదలకానుంది. ఈ సందర్భంగా మంగళవారం సాహి సురేష్ పాత్రికేయులతో ముచ్చటిస్తూ “రామారావు ఆన్ డ్యూటీ’ 90 దశకంలో జరిగే కథ. నాటి నేపథ్యాన్ని పునఃసృష్టించడానికి చాలా పరిశోధన చేశాం. గ్రామ వీధులు, ఎమ్మోర్వో ఆఫీస్ వంటి అద్భుతమైన సెట్స్ వేశాం. ముఖ్యంగా ఎమ్మార్వో ఆఫీస్ సెట్ బాగా కుదిరింది.
ఖర్చు విషయంలో నిర్మాతలు ఎక్కడా రాజీపడక పోవడంతో సెట్స్ను అనుకున్న విధంగా తీర్చిదిద్దాను. దర్శకుడు అందించే స్ఫూర్తిని బట్టి ఆర్ట్ డైరెక్షన్లో ఫలితాలు కనిపిస్తాయి. దర్శకుడు, సినిమాటోగ్రాఫర్, ఆర్ట్ డైరెక్టర్..ఈ ముగ్గురి మధ్య సృజనాత్మక అవగాహన కుదిరితే ఆర్ట్ వర్క్ మరో స్థాయికి వెళ్తుంది’ అన్నారు. హాలీవుడ్లో ఉండే ప్రొడక్షన్ డిజైనర్ అనే ట్రెండ్ ఈ మధ్యే మన దగ్గర మొదలైందని, ఎంత సాంకేతికత వచ్చినా కళా దర్శకుడి పనిని అతనే చేయాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం మాచర్ల నియోజకవర్గం, కార్తికేయ-2, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, నితిన్-వక్కంతం వంశీ సినిమాలు చేస్తున్నానని సాహి సురేష్ వెల్లడించారు.