చిరంజీవి హీరోగా నటించిన ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ సినిమాలు ఈ సంక్రాంతి బాక్సాఫీస్ బరిలో నిలిచాయి. జనవరి 12,13 తేదీల్లో ఈ చిత్రాలు విడుదల కాబోతున్నాయి. ఈ రెండు చిత్రాల్లో శ్రోతలు మెచ్చే పాటలు రాశారు గీత రచయిత రామజోగయ్య శాస్త్రి. ‘వీరసింహారెడ్డి’లో అన్ని పాటలు రాసిన ఆయన…‘వాల్తేరు వీరయ్య’లో నీకేమో అందమెక్కువ, నాకేమో తొందరెక్కువ అనే గీతాన్ని రచించారు.
ఈ సినిమాలకు సాహిత్యాన్ని అందించిన అనుభవాలను తాజా ఇంటర్వ్యూలో వివరించారు రామజోగయ్య శాస్త్రి. ఆయన మాట్లాడుతూ…‘సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్తో పాట గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు నీకేమో అందమెక్కువ, నాకేమో తొందరెక్కువ అనే లిరిక్స్ చెప్పాను. ఆ సౌండింగ్ బాగుందని దేవి ఒక కాన్సెప్ట్ అనుకుని ట్యూన్ ఇచ్చారు. ఇలా ఆ పాట రూపకల్పన జరిగింది. చిరంజీవి గారికి ఒక పాట రాసి వినిపిస్తే తన స్పందన తెలియజేస్తారు. పాట నచ్చితే ప్రశంసిస్తారు. స్టార్స్ సినిమాలకు పాటలు రాయడంలో ఒత్తిడి ఉంటుంది.
రచయితగా నా అనుభవం, టెక్నిక్ను బట్టి కొత్తగా పాట రాసేందుకు ప్రయత్నిస్తా. మంచి సాహిత్యం రావాలంటే కొంత సమయం కేటాయించాలి. ‘వీరసింహారెడ్డి’లో మొత్తం పాటలన్నీ నేనే రాశాను. బాలకృష్ణ గారికి గతంలో పాటలు రాశాను కాబట్టి. ఈసారి కొత్తగా ఎలాంటి ఆలోచనతో పాటను రాయాలనేది సవాలుగా తీసుకున్నాను. మా బావ మనోభావాలు, మాస్ మొగుడు లాంటి పదాలు అలా వచ్చినవే.
ఒక్క పాట అయినా, సింగిల్ కార్డ్ అయినా నేను దర్శకుడి ఆలోచనల మేరకే సాహిత్యాన్ని అందించాల్సి ఉంటుంది. ఈ రెండు సినిమాలు ప్రేక్షకులకు మంచి అనుభూతినిస్తాయి. రెండూ మంచి విజయాలు సాధిస్తాయనే నమ్మకం ఉంది. సాహిత్యం రాయగలగటం వేరు పాటలు రాయడం వేరు. ఇక్కడ స్వరానికి పాట రాయాల్సి ఉంటుంది. అలాగే సరళంగా పాట రాయాలి. నేర్పు, సహనం, అభ్యాసం ఉంటే కొత్త వారు కూడా మంచి పాటలు రాయవచ్చు’ అన్నారు.