‘అభిరామ్తో నేను సినిమా చేయాలన్నది రామానాయుడుగారి కోరిక. ఆయన సినిమా చేయమని అడిగినప్పుడు చేయలేకపోయా. కొన్ని రోజుల తర్వాత ఆయన వెళ్లిపోయారు. అక్కడి నుంచి నాలో ఏదో తెలియని బాధ మొదలైంది. అప్పుడే అభిరామ్ కోసం కథ సిద్ధం చేశా’ అన్నారు తేజ. ఆయన దర్శకత్వంలో అభిరామ్ కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘అహింస’. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై పి.కిరణ్ నిర్మిస్తున్నారు. గీతికా తివారీ కథానాయిక. జూన్ 2న విడుదలకానుంది.
శనివారం ఏపీలోని చీరాలలో ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. తేజ మాట్లాడుతూ ‘రానాతో ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా చేశా. మళ్లీ రానాతో ఓ సినిమాకు ప్లాన్ చేస్తున్నా. దానికి ‘రాక్షస రాజు’ అనే టైటిల్ అనుకుంటున్నా’ అని చెప్పారు. తేజ వంటి టాలెంటెడ్ దర్శకుడి ద్వారా తన తమ్ముడు హీరోగా పరిచయం కావడం ఆనందంగా ఉందని, బాబాయ్ని.. తనను ఆదరించినట్లుగానే అభిరామ్ను కూడా ప్రేక్షకులు ఆదరించాలని హీరో రానా కోరారు.
అభిరామ్ మాట్లాడుతూ ‘నన్ను హీరోగా చూడాలన్నది తాతగారి కోరిక. ఆయన దీవెనలు నాపై ఉంటాయని కోరుకుంటున్నా. తాతగారి జయంతి రోజున ఈ సినిమా విడుదలకాబోతుండటం ఆనందంగా ఉంది’ అన్నారు. అభిరామ్ను హీరోగా చేస్తానని నాన్నకు మాటిచ్చానని, దర్శకుడు తేజ ద్వారా ఆ కోరిక నెరవేరిందని సురేష్ బాబు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో శ్యామ్ప్రసాద్ రెడ్డి, ఆర్.పి.పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.