Radhika Apte | విభిన్నమైన నటప్రయాణం సాగిస్తున్నది కథానాయిక రాధిక ఆప్టే. సాటి హీరోయిన్లతో పోలిస్తే ఆమెది పెక్యులర్ కెరీర్. సినిమాలు, వెబ్సిరీస్లు, టీవీషోలు.. ఇలా వేదిక ఏదైనా సరే, నచ్చితే చేసేయడం రాధిక ప్రత్యేకత. రీసెంట్గా కత్రినాకైఫ్ కథానాయికగా నటిస్తున్న ఓ చిత్రంలో అతిథిపాత్రలో నటించింది రాధిక ఆప్టే. పూర్తి వివరాల్లోకెళ్తే- విజయ్ సేతుపతి, కత్రినాకైఫ్ ప్రధాన పాత్రధారులుగా శ్రీరాం రాఘవన్ దర్శకత్వంలో ‘మేరీ క్రిస్మస్’ అనే సినిమా రూపొందుతున్నది.
అందులోనే రాధిక అతిథిగా నటించింది. అతిథి అంటే సినిమాలో ఓ అయిదారు సన్నివేశాలు ఉంటాయి అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. కేవలం ఒకేఒక్క సన్నివేశంలో ఆమె కనిపిస్తుంది. ఈ పాత్ర గురించి రాధికా ఆప్టే మాట్లాడుతూ ‘ఇంత చిన్న పాత్ర ఒప్పుకోడానికి కారణం కేవలం దర్శకుడు. తను నాకు మంచి ఫ్రెండ్. అంతేకాదు. తను తీసిన ప్రతి సినిమాలోనూ నేనున్నా. ఆ సెంటిమెంట్ని మిస్ చేయకూడదనే నటించా. చేసింది ఒక్క సన్నివేశమే అయినా.. షూటింగ్ మాత్రం రెండు రాత్రుళ్లు పాల్గొనాల్సి వచ్చింది’ అంటూ చెప్పుకొచ్చింది రాధిక ఆప్టే.