Puri Jagannadh | అగ్ర దర్శకుడు పూరీ జగన్నాథ్ తన ప్రత్యేక ఆలోచనలు, జీవిత తత్వాన్ని ‘పూరీ మ్యూజింగ్స్’ పేరుతో అభిమానులతో పంచుకుంటున్న సంగతి తెలిసిందే. సమాజం, మనస్తత్వం, జీవితం, సంబంధాలు, ఆధ్యాత్మికత వంటి పలు అంశాలపై తనదైన శైలిలో మాట్లాడే పూరీ.. తాజాగా భారతదేశానికి చెందిన గొప్ప ఆధ్యాత్మిక గురువు రమణ మహర్షి గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ప్రస్తుతం విజయ్ సేతుపతితో కలిసి ‘స్లమ్ డాగ్ – 33 టెంపుల్ రోడ్’ సినిమా తెరకెక్కిస్తున్న పూరీ జగన్నాథ్.. తన యూట్యూబ్ ఛానల్లో వరుసగా పాడ్కాస్ట్ వీడియోలను విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా విడుదల చేసిన వీడియోలో రమణ మహర్షి జీవితం, ఆయన ఆలోచనలు, ఆధ్యాత్మిక ప్రయాణం గురించి విశ్లేషించారు.
పూరీ మాట్లాడుతూ.. “రమణ మహర్షి అసలు పేరు వెంకటరామన్ అయ్యర్. 1879లో తమిళనాడులో జన్మించారు. కేవలం 16 ఏళ్ల వయసులోనే ఆయనకు గొప్ప ఆత్మానుభవం కలిగింది. ‘నేను ఎవరు?’ అనే ప్రశ్న ఆయన మనసులో మొదలైంది. అదే ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చేసింది” అని చెప్పారు.ఆ ప్రశ్నకు సమాధానం వెతికే ప్రయత్నంలో ఆయన ఇంటిని విడిచి తిరువణ్ణామలైకి వెళ్లిపోయారని పూరీ వివరించారు. అక్కడ అరుణాచల కొండల సమీపంలో నివసిస్తూ ‘ఆత్మ విచారం’ అనే మార్గాన్ని అనుసరించారని తెలిపారు. “మనసును లోపలికి తిప్పి నిజమైన మన స్వరూపాన్ని తెలుసుకోవడమే ఆత్మ విచారం” అని పూరీ పేర్కొన్నారు.
రమణ మహర్షి చాలా సంవత్సరాలు మౌనంగా గడిపారు. అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడేవారు. విరూపాక్ష గుహల్లో ధ్యానం చేస్తూ ఉండగా పిల్లులు, పురుగులు శరీరాన్ని గాయపరిచినా ఆయన ధ్యానం నుంచి బయటకు రాలేదు. అంత లోతైన సమాధి స్థితిలోకి వెళ్లిపోయేవారు. అదే సమయంలో ఆయనకు జ్ఞానోదయం కలిగింది” అని తెలిపారు.రమణ మహర్షి జీవనశైలి ఎంత సాదాసీదాగా ఉండేదో కూడా పూరీ వివరించారు. “ఆశ్రమంలో ఆయన కూడా వంట చేసేవారు. కూరగాయలు తరిగేవారు. ప్రత్యేకమైన ఆహారం కోరుకునేవారు కాదు. అందరితో కలిసి కూర్చుని భోజనం చేసేవారు” అని చెప్పారు. జంతువుల పట్ల రమణ మహర్షి చూపిన ప్రేమను కూడా పూరీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. “ఆశ్రమంలో ఉన్న గోవు లక్ష్మిని ఎంతో ప్రేమించేవారు. కోతులు, కుక్కలు, నెమళ్లు కూడా ఆశ్రమంలో స్వేచ్ఛగా తిరిగేవి. జంతువులకు కూడా ఆత్మ ఉందని ఆయన నమ్మేవారు. అందుకే వాటిని మనుషుల్లాగే గౌరవించేవారు” అని తెలిపారు.
ఇక రమణాశ్రమం గురించి మాట్లాడుతూ.. “ప్రస్తుతం ఆయన నివసించిన ప్రదేశంలో శ్రీ రమణాశ్రమం ఏర్పడింది. ప్రపంచం నలుమూలల నుంచి ఎంతో మంది అక్కడికి వచ్చి ధ్యానం చేస్తుంటారు. ఆ ఆశ్రమం నిశ్శబ్ద వాతావరణంలో ఉంటుంది. జీవితంలో ఒక్కసారైనా వెళ్లి చూడాల్సిన ప్రదేశం అది” అని పూరీ పేర్కొన్నారు. రమణ మహర్షి బోధనల్లో మౌనానికి ఉన్న ప్రాముఖ్యతను కూడా పూరీ గుర్తు చేశారు. “నిశ్శబ్దమే అత్యంత శక్తివంతమైన బోధన అని రమణ మహర్షి చెప్పేవారు. ప్రేమ, శాంతి, జ్ఞానం ఆయన సందేశం. చాలా ప్రశ్నలకు ఆయన నవ్వుతోనే సమాధానం చెప్పేవారు” అని తెలిపారు.
చివరగా రమణ మహర్షి చెప్పిన మాటలను గుర్తు చేస్తూ పూరీ.. “‘నేను ఎవర్ని?’ అనే ప్రశ్న జవాబు కోసం కాదు.. ప్రశ్నించే తనని తాను తెలుసుకోవడానికి ఉద్దేశించబడింది” అంటూ ముగించారు. ప్రస్తుతం పూరీ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.