బెంగళూరు: సినీ ప్రపంచాన్ని విషాదంలో ముంచుతూ హఠాన్మరణం పాలైన కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్కుమార్ అంత్యక్రియలు ఆదివారం జరుగుతాయని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై వెల్లడించారు. అమెరికాలో ఉన్న పునీత్ కుమార్తె ధ్రుతి తండ్రి చివరి చూపు కోసం వస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఇప్పటికే ఆమె ఢిల్లీకి చేరుకుందని, బెంగళూరు వచ్చే సరికి సాయంత్రం 7 గంటలు అవుతుందని చెప్పారు. సంప్రదాయం ప్రకారం రాత్రి సమయంలో అంత్యక్రియలు జరపరని, అందువల్ల ఆదివారం నాడు ఈ కార్యక్రమం నిర్వహిస్తామని ఆయన వివరించారు. ఆదివారం నాడు కంఠీరవ మైదానంలో పునీత్ రాజ్కుమార్ అంత్యక్రియలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు.