బాలీవుడ్ టాప్ యాక్ట్రెస్లో దీపికా పదుకొణే,ప్రియాంక చోప్రా తప్పక ఉంటారు. ఈ ముద్దుగుమ్మలు హిందీలో అలరించడమే కాకుండా హాలీవుడ్లో సత్తా చాటారు.అయితే ఇప్పుడు దీపికా స్థానాన్ని ప్రియాంక చోప్రా భర్తి చేయబోతుందట. జియో ‘ముంబై అకాడమీ ఆఫ్ మూవింగ్ ఇమేజ్’ (ఎమ్ఏఎమ్ఐ-మామి) ఫిల్మ్ ఫెస్టివల్ చైర్ పర్సన్గా కొనసాగుతున్న దీపికా స్థానంలో ప్రియాంక వచ్చి చేరనుంది.
నాలుగు నెలల క్రితం దీపికా ఆ పదవి నుండి వైదొలగగా.. ఇప్పుడు ఆమె స్థానంలో ప్రియాంక చోప్రాను ‘మామి’ చైర్ పర్సన్గా ఎన్నుకున్నారు. ‘మామి’ బోర్డు సభ్యులు కో చైర్ పర్సన్ నీతా ముఖేశ్ అంబానీ, ఫిల్మ్ డైరక్టర్ అనుపమ చోప్రా, అజయ్ బిజ్లీ, ఆనంద్ జీ మహీంద్రా, ఫర్హన్ అక్తర్, ఇషా అంబానీ, కబీర్ ఖాన్, కౌస్తుభ్ ధావ్సే, కిరణ్ రావు, రానా దగ్గుబాటి, రితేశ్ దేశ్ముఖ్, రోహన్ సిప్పీ, సిద్ధార్థ్ రాయ్ కపూర్, విక్రమాదిత్య మోత్వానే, విశాల్ భరద్వాజ్, జోయా అక్తర్ ఏకగ్రీవంగా ప్రియాంకని ఎన్నుకోవడం విశేషం.
మామి చైర్పర్సన్గా ఎన్నికవడం సంతోషంగా ఉందని చెప్పిన ప్రియాంక..మామి సభ్యులతో కలిసి పని చేయడం సంతోషంగా ఉందని, ఫిల్మ్ఫెస్టివల్ను మరోస్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని తన అధికారిక సోషల్మీడియా ఖాతాలో వెల్లడించింది. 22వ ‘మామి’ ముంబై ఫిల్మ్ ఫెస్టివల్ ఎడిషన్ కరోనా వైరస్ కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. జియో మామి ఫిల్మ్ ఫెస్టివల్ 2021 అక్టోబర్ నుంచి 2022 మార్చి వరకు జరగనుంది.