హాలీవుడ్ సినిమాల్లో కంటే బాలీవుడ్లోనే తనకు వైవిధ్యమైన పాత్రల్ని పోషించే అవకాశం దక్కిందని గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా చెప్పింది. కేన్స్ లయన్స్ కాన్ఫరెన్స్లో ఆమె పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. బాలీవుడ్ కెరీర్ తొలినాళ్లలో అద్భుతమైన పాత్రలు దక్కాయని, ప్రతిభావంతులైన దర్శకులతో పనిచేశానని ఆనందం వ్యక్తం చేసింది. ప్రస్తుతం వృత్తి, వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యం పాటిస్తున్నానని, గతంలో మాదిరిగా హడావిడిగా షూటింగ్లకు బయలుదేరే ధోరణి నుంచి బయటపడ్డానని చెప్పింది.
హాలీవుడ్లో తనకు వస్తున్న అవకాశాలు పరిమితంగా ఉంటున్నాయని, భారతీయ సినిమా తరహాలో అక్కడ కూడా వినూత్న కథా చిత్రాల్లో నటించాలన్నది తన లక్ష్యమని ప్రియాంకచోప్రా అభిప్రాయపడింది. ‘వారణాసి’ చిత్రం గురించి చెబుతూ ‘ప్రపంచంలోని 200 భాషల్లో ఈ సినిమాను డబ్బింగ్ చేస్తున్నారు. దర్శకుడు రాజమౌళి విజన్ అద్భుతం. హాలీవుడ్కు క్రిష్టోఫర్ నోలన్, స్పీల్బర్గ్ ఎలాగో.. భారతీయ సినిమాకు రాజమౌళి అలాంటి వారు’ అంటూ ప్రశంసల్లో ముంచెత్తింది ప్రియాంకచోప్రా.