Priyadarshi | ప్రియదర్శితో మాటముచ్చట అంటే ఊరికి పోయి దోస్తుల్ని కలుసుకున్నట్లే ఉంటది. అంతటి స్వచ్ఛమైన తెలంగాణ యాసలో పల్లెతనాన్ని గుర్తుకు తెస్తాడు. మన యాసభాషల్ని వెండి తెరపై సాధికారికంగా పలికిస్తాడు. అందుకే ‘మల్లేశం’, ‘బలగం’ వంటి తెలంగాణ మట్టి కథలతో ప్రేక్షకులకు చేరువయ్యాడు. ‘ఇప్పుడు కెమెరాలు తెలంగాణ పల్లె వీధుల్లో విహరిస్తున్నాయి. యువ రచయితల్లో మన కథల్ని చెప్పాలనే తపన ఎక్కువైంది. ఇదంతా ప్రత్యేక రాష్ట్రం వల్లనే సాధ్యమవుతున్నది. భవిష్యత్తులో తెలంగాణ కథకు స్వర్ణయుగం రాబోతున్నది’ అని ధీమా వ్యక్తం చేశాడు ప్రియదర్శి. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని ‘నమస్తే తెలంగాణ’తో ఆయన ప్రత్యేకంగా సంభాషించాడు. ఆ సంగతులన్నీ ప్రియదర్శి మాటల్లోనే..
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ కవులు, కళాకారులకు సముచిత గౌరవం దక్కుతున్నది. సినీ రచయితలు తమ తెలంగాణ యాసకు పదునుపెడుతున్నారు. తమదైన అస్తిత్వాన్ని బలంగా వ్యక్తీకరించాలనే తపన పెరుగుతున్నది. డిజిటల్ విప్లవం పుణ్యమాని కెమెరాలు తెలంగాణ పల్లె వీధుల్లో విహరిస్తున్నాయి. అక్కడి జీవితాలను పట్టి చూపిస్తున్నాయి. ఫిల్మ్ మేకింగ్కు హద్దులు చెరిగిపోవడం వల్ల.. మారుమూల ప్రాంతాల యువకులు కూడా డిజిటల్ మాధ్యమాల ద్వారా తమ కథలను ఆవిష్కరిస్తున్నారు.
ఉద్యమ సమయంలో చేపట్టిన మిలియన్ మార్చ్ నాకు బాగా గుర్తుండిపోయింది. ఆ ఘట్టం తెలంగాణ ప్రజల్లో ఓ సామూహిక చేతనకు పురిగొల్పింది. రాష్ట్ర సాధన చరిత్రలో అదొక కీలక మలుపు. అదే స్ఫూర్తితో నేడు తెలంగాణ కళారంగం కదం తొక్కుతున్నది. సినీ పరిశ్రమలోకి కొత్తగా వచ్చేవారు తెలంగాణ కథల్ని దృశ్యమానం చేయాలని ఉవ్విళ్లూరు తున్నారు. ఒకప్పుడు సినిమాల్లో తెలంగాణ యాస, భాషలు తీవ్ర వివక్షకు గురయ్యాయి. ఈ ధోరణి కొన్ని దశాబ్దాల పాటు కొనసాగింది. ఒకవేళ తెలంగాణ రాకపోయి ఉంటే, అదే పరిస్థితి కొనసాగి ఉండేదేమో. నా దృష్టిలో గొప్ప రాజకీయ నిర్ణయాలు ఓ గొలుసుకట్టు చర్యలా సమాజంలోని అన్ని రంగాల్లో మార్పులకు కారణమవుతాయి. తెలంగాణ సాకారం అలాంటిదే. రాష్ట్రం సిద్ధించింది కాబట్టే నేడు అన్ని రంగాల్లో పురోగమనం సాధ్యమవుతున్నది. అది సినీరంగంలో మరింత స్పష్టంగా కనిపిస్తున్నది. తెలంగాణ సినిమాకు మంచిరోజులొచ్చాయి.
గతంలో తెలంగాణలో అరుదుగా షూటింగ్స్ జరిగేవి. ఇప్పుడు తెరపై మన గ్రామాలూ కనిపిస్తున్నాయి. ‘మల్లేశం’, ‘దసరా’, ‘బలగం’ చిత్రాల షూటింగ్స్ మొత్తం తెలంగాణలోనే జరిగాయి. ‘బలగం’ సినిమాను గ్రామాల్లో తెరలు కట్టి ప్రదర్శించారు. ఇదొక సినీ సాంస్కృతిక విప్లవం. సినిమాల ద్వారాప్రజలు తమ కల్చరల్ ఐడెంటిటీని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. తెలంగాణ పండగలు, ఆచార వ్యవహారాలు సినిమాల్లో కనిపిస్తున్నాయి. ‘బలగం’ చూస్తున్నప్పుడు చావు విషయంలో మనం ఎలాంటి ఆచారాలు పాటిస్తామో తెలిసిపోతుంది. ఒకప్పుడు హీరో గోదావరి ఎక్స్ప్రెస్ దిగేవాడు. ఇప్పుడు కరీంనగర్ బస్ దిగుతున్నాడు. అంతలా తెలంగాణ కథాబలం పెరిగింది.
అభివృద్ధిలో హైదరాబాద్ రాకెట్ వేగంతో దూసుకుపోతున్నది. మౌలిక వసతులతో పాటు ఆఫీస్ వర్క్ స్పేస్ బాగా పెరిగింది. ఎన్నో మల్టీనేషనల్ కంపెనీలకు చిరునామాగా మారింది. రాష్ట్ర ఆవిర్భావానికి పూర్వం కరెంట్ కోత లతో బాధపడేవాళ్లం. ఇప్పుడు ఆ కష్టాలన్నీ తీరిపోయాయి. సీఎం కేసీఆర్గారి ముందుచూపువల్లే ఇదంతా సాధ్యమైంది. మంత్రి కేటీఆర్గారు దేశవిదేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షిస్తూ ఐటీ విప్లవాన్ని తీసుకొస్తున్నారు. సినీ రంగాన్ని కూడా ఎంతో ప్రోత్సహిస్తున్నారు. మేము కోరిన వెంటనే ‘మల్లేశం’ చిత్రానికి పన్ను మినహాయింపునిచ్చి అండగా నిలిచారు. వ్యక్తిగతంగా కూడా ఆ సినిమాను బాగా ప్రమోట్ చేశారు. మంత్రి హరీశ్రావుగారు సైతం అద్భుతంగా పనిచేస్తున్నారు. ఎప్పుడు కలిసినా ‘మీ సినిమాలు బాగుంటున్నాయి. మంచి సినిమాలు చేయండి’ అంటూ ప్రోత్సహిస్తుంటారు.
‘మల్లేశం’ సమయంలో యాస మీద బాగా దృష్టిపెట్టాను. నల్గొండ పల్లెల్లో షూటింగ్ చేస్తున్నప్పుడు అక్కడి ప్రజలు మాట్లాడే విధానం అబ్బురపరిచింది. రచయితల సహకారంతో యాస బాగా ప్రాక్టీస్ చేశాను. ఇక ‘బలగం’ విషయంలో దర్శకుడు వేణులా మాట్లాడాలని మేమంతా నిర్ణయించుకున్నాం. ఆయన శైలిలోనే డైలాగ్స్ చెప్పాం. ఈ రెండు చిత్రాలతో గ్రామీణ తెలంగాణ యాసపై మంచి పట్టు సాధించాను. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే.. పల్లెటూళ్లో మన దోస్తు ముచ్చట పెట్టినట్టే ఉంటది.
సినిమాలపరంగా భవిష్యత్తులో తెలంగాణకు మరింత ప్రాతినిధ్యం పెరుగుతుంది. ఇక్కడి నుంచి విభిన్నమైన కథలు రావాల్సిన అవసరం ఉంది. తెలంగాణ గ్రామీణ ఇతివృత్తాలతో పాటు హైదరాబాద్ పాతబస్తీ నేపథ్యంలో ఎన్నో కథల్ని చూపించొచ్చు. నేను కూడా అలాంటి స్టోరీస్ కోసం ఎదురుచూస్తున్నా. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్ట్లు పూర్తి కావడంతో గ్రామాలన్నీ నీళ్లతో కళకళలాడుతున్నాయి. పచ్చదనంతో శోభిల్లుతున్నాయి. అక్కడి నేపథ్యాల్ని తీసుకొని మంచి కథలు సిద్ధం చేస్తే బాగుంటుందని కేటీఆర్గారు ఓ సందర్భంలో నాతో అన్నారు కూడా. ఇప్పటికే తెలంగాణ సినిమా ఇండిపెండెంట్ మూవీగా ఎదుగుతున్నది. మన పరిశ్రమకు ఉజ్వలమైన భవిష్యత్తు కనిపిస్తున్నది. మన కథలకు స్వర్ణయుగం రాబోతున్నది. దశాబ్ది వేడుకల సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు.
…? కళాధర్ రావు జూలపల్లి