‘దర్శకుడు అర్జున్ ఈ కథ చెప్పినప్పుడు ఎక్సయిటింగ్గా అనిపించింది. సుహాస్కి విభిన్నమైన కథలు బాగా నప్పుతాయి. ఇది ఫేస్ బ్లైండ్నెస్ కాన్సెప్ట్. ఇలాంటి కథ ఇండియాలో ఇప్పటివరకూ రాలేదని నా అభిప్రాయం’ అంటున్నారు నిర్మాత జె.ఎస్.మణికంఠ. ఆయన నిర్మిస్తున్న చిత్రం ‘ప్రసన్నవదనం’. సుహాస్ కథానాయకుడు. పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్ కథానాయికలు. అర్జున్ వై.కె దర్శకుడు. మే 3న సినిమా విడుదల కానుంది.
ఈ సందర్భంగా నిర్మాత మణికంఠ విలేకరులతో ముచ్చటించారు. ‘ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచేలా సినిమా చేశాం. నిర్మాణంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. బిజినెస్ పరంగా లాభాల్లో ఉన్నాం. అగ్రనిర్మాణ సంస్థలైన మైత్రీ, హోంబలే సినిమాని విడుదల చేయడం ఆనందంగా ఉంది’ అని తెలిపారు మణికంఠ.
దర్శకుడు అర్జున్ అద్భుతంగా వర్క్ చేసి, పకడ్బందీగా ఈ కథ రాశాడని ఆయన చెప్పారు. ఎవరు సలహాలు చెప్పినా తీసుకుంటాడని, సినిమాకు ఏది మంచో అదే చేస్తాడనీ, చెప్పిన దానికంటే గొప్పగా తీశాడని మణికంఠ తెలిపారు. ‘సుహాస్ తెలుగు పరిశ్రమకు దక్కిన అదృష్టం. ఇప్పుడు దర్శకులందరూ సుహాస్ని దృష్టిలో పెట్టుకొనే కథలు రాస్తున్నారు. నిర్మాత, దర్శకులను ఇబ్బందిపెట్టని క్రమశిక్షణగల నటుడు సుహాస్. తనతో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది’ అని పేర్కొన్నారు మణికంఠ. సాంకేతికంగా కూడా సినిమా నెక్ట్స్ లెవల్లో ఉంటుందని, తరువాతి సినిమా కూడా సుహాస్తోనే ఉంటుందని మణికంఠ తెలిపారు.