Prakash Raj | ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ చట్టపరమైన చిక్కుల్లో చిక్కుకున్నారనే వార్త ప్రస్తుతం సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. పలు రాష్ట్రాల్లో ఒకటి కంటే ఎక్కువ ఓటర్ ఐడీ కార్డులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో బెంగళూరులోని 48వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ (ACJM) కోర్టు ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ (NBW) జారీ చేసినట్లు సమాచారం. కోర్టు పలుమార్లు సమన్లు జారీ చేసినప్పటికీ విచారణకు హాజరు కాకపోవడంతో ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రకాష్ రాజ్పై అరెస్ట్ చర్యలు తీసుకోవచ్చనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. కాగా, ఈ కేసు 2019లో నమోదైంది. ప్రకాష్ రాజ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో వేర్వేరు ఓటర్ ఐడీ కార్డులు కలిగి ఉన్నారంటూ న్యాయవాది దిలీప్ కుమార్ హలసూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఫిర్యాదుపై పోలీసులు, ఎన్నికల అధికారులు తగిన చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ ఆయన కోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్ను స్వీకరించిన బెంగళూరు మేజిస్ట్రేట్ కోర్టు విచారణ ప్రారంభించింది. విచారణలో భాగంగా ప్రకాష్ రాజ్ను కోర్టు ముందు హాజరుకావాలని ఇప్పటికే రెండుసార్లు సమన్లు జారీ చేసినట్లు సమాచారం. అయితే ఆయన విచారణకు హాజరు కాకపోవడంతో పాటు ఎలాంటి సమాధానం కూడా ఇవ్వకపోవడంతో కోర్టు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించింది. దీంతో ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. వరుసగా కోర్టు ఆదేశాలను పట్టించుకోకపోవడం వల్ల ప్రకాష్ రాజ్ చట్టపరమైన ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉందని న్యాయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ కొనసాగుతోంది. ఎన్నికల సంఘం చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా ఓటర్ల వివరాలను పరిశీలించడం, తప్పులు సవరించడం, నకిలీ లేదా అనర్హ ఓటర్ల పేర్లను తొలగించడం వంటి చర్యలు చేపడుతున్నారు.
ఈ నేపథ్యంలో ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాల్లో ఓటర్ కార్డులు కలిగి ఉన్నారనే ఆరోపణలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మరోవైపు, ప్రకాష్ రాజ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. పలువురు స్టార్ హీరోల చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తూ ఆయన తన కెరీర్ను కొనసాగిస్తున్నారు. బాలీవుడ్లో రూపొందుతున్న ‘దృశ్యం 3’ చిత్రంలో కూడా ఆయన ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ షెడ్యూల్ను కూడా ఆయన పూర్తి చేసినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.