‘హారర్ ఫాంటసీ జోనర్లో ‘ది రాజాసాబ్’ చిత్రాన్ని తెరకెక్కించాం. ప్రభాస్ క్యారెక్టర్ సరికొత్త పంథాలో ఉంటుంది. అభిమానులు రెట్టింపు ఆనందాన్ని గుండెల్లో నింపుకొని థియేటర్ నుంచి బయటికొస్తారు’ అన్నారు మారుతి. ఆయన దర్శకత్వంలో ప్రభాస్ కథానాయకుడిగా నటించిన పాన్ ఇండియా చిత్రం ‘ది రాజాసాబ్’ ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకురానుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు.
ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్లో ప్రీరిలీజ్ ప్రెస్మీట్ను నిర్వహించారు. చిత్ర నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ ‘మూడేళ్ల క్రితం ఈ సినిమా జర్నీ మొదలైంది. మొదట హారర్ కామెడీ అనుకున్నాం. ఆ తర్వాత మరింత స్కేల్ పెంచి హారర్ ఫాంటసీగా మార్చాం. భారీ సెట్స్ నిర్మించాం. ఇప్పటివరకు ఇండియన్ సినిమాలో ఇంతటి భారీ స్థాయి హారర్ ఫాంటసీ మూవీ రాలేదు. సినిమా ైక్లెమాక్స్ ఘట్టాలు అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లోబల్ మూవీ ఫీల్ని అందిస్తాయి. తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా 100కోట్ల వసూళ్లను అంచనా వేస్తున్నాం’ అన్నారు.
ఈ సినిమా కోసం దర్శకుడు మారుతి ఓ సరికొత్త ప్రపంచాన్ని సృష్టించారని, దానికి తగినట్లే బీజీఎం అందించానని, పాటలన్నీ సూపర్హిట్ అయ్యాయని సంగీత దర్శకుడు తమన్ పేర్కొన్నారు. ప్రీమియర్స్ పడిన తర్వాత ప్రతీ ఒక్కరు ప్రభాస్ పర్ఫార్మెన్స్, మారుతి టేకింగ్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మేకింగ్ గురించే మాట్లాకుంటారని, అడ్వాన్స్ బుకింగ్ చూస్తుంటే గూజ్బంప్స్ వస్తున్నాయని క్రియేటివ్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చిత్ర కథానాయికలు నిధి అగర్వాల్, రిద్దికుమార్ కూడా మాట్లాడారు.