రెబల్ స్టార్ ప్రభాస్, మారుతి కాంబోలో సినిమా గురించి మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా ఫస్ట్లుక్, టైటిల్ను సంక్రాంతికి ప్రకటించనున్నారు. గతంలో ఎన్నడూచూడని అవతారంలో ప్రభాస్ను చూడాలని అభిమానులు ఎంతో ఉత్సుకతతో ఉన్న తరుణంలో తాజా అప్డేట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ‘సంక్రాంతి రోజు సూర్యోదయంతోపాటు రెబల్ స్టార్ కూడా త్వరగా మీ అందరికీ డబుల్ ట్రీట్ ఇవ్వనున్నారు. టైటిల్, ఫస్ట్ లుక్ జనవరి 15న ఉదయం 7.08 గంటలకు ఆవిష్కరించనున్నాం.
ప్రభాస్ పొంగల్ ఫెస్ట్కు సిద్ధంగా ఉండండి’ అంటూ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ట్వీట్ చేసింది. ఉదయించే సూర్యడు, అరుస్తున్న కోడిపుంజుతో టైటిల్ అనౌన్స్మెంట్ పోస్టర్ను చిత్ర యూనిట్ పోస్ట్ చేసింది. ‘వింటేజ్ డార్లింగ్ ప్రభాస్ మీ ముందుకు వచ్చేస్తున్నారు’ అని పేర్కొంది. ఈ సినిమా హారర్ కామెడీ జోనర్లో తెరకెక్కుతోంది. చాలా కాలం తర్వాత ప్రభాస్ ఫుల్ ఫన్ ఉండే క్యారెక్టర్ చేస్తున్నాడు. హీరోలను సరికొత్తగా ప్రజెంట్ చేస్తారనే పేరున్న దర్శకుడు మారుతితో కలిసి ప్రభాస్ చేస్తున్న ఈ పాన్ ఇండియా మూవీని టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు.
ఇందులో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. మాళవిక మోహనన్, రిద్దికుమార్, నిధి అగర్వాల్ ప్రభాస్ సరసన ఆడిపాడనున్నారు. సంజయ్ దత్ ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. డిసెంబర్లో విడుదలకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. ప్రభాస్ ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ‘కల్కి’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ‘కల్కి’ మేలో వస్తున్నందున మారుతి-డార్లింగ్ కాంబో మూవీని ఏడాది చివరన తేవాలన్నది ఆలోచన.
సంవత్సరానికి రెండు రిలీజ్లు ఉండేలా చూస్తానని అభిమానులకు ఇచ్చిన మాట నెరవేరేలా దర్శకుడు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. 2023లో ‘ఆదిపురుష్’, ‘సలార్-సీజ్ ఫైర్’ రాగా, ఈ ఏడాది ‘కల్కి’తోపాటే రేపు టైటిల్ ప్రకటించనున్న ఈ చిత్రం రావొచ్చు. ఆ తర్వాత ‘సలార్-2’, ‘స్పిరిట్’తోపాటు దర్శకుడు హను రాఘవపూడితో మరో ప్రాజెక్టు క్యూలో ఉండనే ఉన్నాయి.