అసెంబ్లీలో మంత్రి ఐకే రెడ్డి
నిర్మల్ అర్బన్, మార్చి 22 : రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణలో భాగంగా చేపట్టిన వివిధ కార్యక్రమాలు సత్ఫలితాలిస్తున్నాయని, 3.67 శాతం పచ్చదనం పెరిగిన ట్లు సర్వే ఆఫ్ ఇండియా ప్రకటించడం హరితహారం ద్వారా సాధించిన విజయమేనని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. సోమవారం అసెంబ్లీలో ఆయన మా ట్లాడారు. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్యసమితి హైదరాబాద్ను ట్రీ సిటీ ఆఫ్ ఇండియాగా గుర్తించినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఇప్పటి వరకు హరితహారం ద్వారా 230 కోట్ల మొక్కలు నాటాలన్నది లక్ష్యం కాగా.. ఇప్పటి వరకు 217.406 కోట్ల మొక్కలు నాటినట్లు చెప్పారు. నాటిన మొక్కల సంరక్షణ, వాటిని బతికించుకోవడంపై ప్రధానంగా దృష్టి సారించామన్నారు. నాటిన మొక్కల్లో 85 శాతం మొక్కలను బతికించుకోవాలనే ఉద్దేశంతో మున్సిపల్, పంచాయతీ రాజ్ చట్టాల్లో సవరణ చేశామని తెలిపారు. గ్రామ పంచాయతీల్లో, మున్సిపాల్టీల్లో మొక్కలను నాటి సంరక్షించేందుకు వార్షిక బడ్జెట్లో 10 శాతం హరిత బడ్జెట్గా ప్రత్యేకంగా కేటాయిస్తున్నామని వివరించారు. అనుబంధ ప్రశ్నలకు సమాధానమిస్తూ.. తెలంగాణలో మొత్తం భౌగోళిక విస్తీ ర్ణం 2.77 కోట్ల ఎకరాలు కాగా.. ఇందులో 66.66 లక్షల ఎకరాల విస్తీర్ణంలో తెలంగాణలో 24.05 శాతం అడవులున్నాయన్నారు. దేశంలో ఉన్న 21.34 శాతం అటవీ విస్తీర్ణంతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి కొంత మెరుగ్గానే ఉందని పేర్కొన్నారు. భౌగోళిక విస్తీర్ణంలో కనీసం 33 శాతం పచ్చదనం ఉండాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.
పల్లాను అభినందించిన మంత్రి అల్లోల..
వరంగల్-ఖమ్మం- నల్గొండ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించిన పల్లా రాజేశ్వర్రెడ్డి అసెంబ్లీలో మర్యాదపూర్వకంగా మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా పల్లా రాజేశ్వర్ రెడ్డిని మంత్రి అభినందించారు.