‘సినిమాల జయాపజయాల్ని ఎవరూ ఊహించలేరు. కొన్ని కథలు వింటున్నప్పుడు అద్భుతంగా అనిపిస్తాయి. తెరపై వచ్చే సరికి పేలవంగా తయారవుతాయి. అదే సమయంలో సాధారణంగా అనిపించిన కొన్ని కథలు గొప్పగా ఆవిష్కృతమవుతాయి. ఇలాంటి విషయాలు తారల ఆధీనంలో ఉండవు కాబట్టి ఫెయిల్యూర్స్ గురించి బాధపడొద్దు’ అని చెప్పింది అగ్ర కథానాయిక పూజాహెగ్డే. ప్రస్తుతం ఈ భామకు అదృష్టం అంతగా కలిసిరావడం లేదు. కొన్ని భారీ చిత్రాల్లో కూడా అవకాశాలు చేజారిపోతున్నాయి.
ఈ నేపథ్యంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పూజాహెగ్డే మాట్లాడుతూ ‘హృతిక్రోషన్తో నటించిన ‘మొహెంజదారో’ కథ విన్నప్పుడు చాలా ఎక్సైట్ అయ్యాను. బాలీవుడ్లో కెరీర్ ఆరంభమే గొప్పగా ఉంటుందనుకున్నా. అయితే ఆ సినిమా విషయంలో నా అంచనాలు తప్పాయి. చాలా సినిమాల విషయంలో అలాగే జరిగింది. కథ నచ్చితే నటించడం వరకే నా పని. మిగతా విషయాలు నా పరిధితో ఉండవు. అందుకే ఫెయిల్యూర్స్ గురించి ఎక్కువ ఆలోచించకుండా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నా’ అని చెప్పింది. మహేష్బాబు నటిస్తున్న ‘గుంటూరు కారం’ చిత్రం నుంచి ఈ భామ తప్పుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. డేట్స్ సర్దుబాటు సమస్యలతో ఆమె ఈ నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు.