కుభీర్, జూన్ 14: తెలంగాణలో సీఎం కేసీఆర్ రైతులను అన్ని విధాలా ఆదుకుంటున్నారని, ఇలాంటి సీఎం తమ దగ్గర ఉంటే ఎంతో బాగుండేదని మహారాష్ట్ర వాసి రోహిలే పద్మ అభిప్రాయపడ్డారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా దెగ్లూర్కు చెందిన రోహలే సదాశివ్కు తెలంగాణలోని నిర్మల్ జిల్లా కుభీర్ మండలం పల్సి గ్రామంలో 5 ఎకరాల సాగు భూమి ఉన్నది. ఇటీవల సదాశివ్ అనారోగ్యంతో మృతి చెందగా నామినీగా ఉన్న అతడి భార్య పద్మ అధికారులకు గత నెలలో నామినీ పత్రాలతోపాటు సంబంధిత ధ్రువపత్రాలు అందజేశారు. రైతుబీమా కింద మంజూరైన రూ.5 లక్షల చెక్కును సోమవారం ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి, ఎంపీపీ తూం లక్ష్మి, ఏడీఏ వీణ, సర్పంచ్ శ్రీరాముల కవిత ఆమెకు అందజేశారు. ఈ సందర్భంగా పద్మ మాట్లాడుతూ.. తెలంగాణలో సీఎం కేసీఆర్ వ్యవసాయానికి ఉచిత కరెంటుతోపాటు, రైతుబంధు ద్వారా ఏడాదికి ఎకరాకు రూ.10 వేలు ఇస్తున్నారని చెప్పారు. రైతుబీమా ద్వారా రూ.5 లక్షలతో తన కుటుంబానికి అండగా నిలిచిన సీఎం కేసీఆర్ సార్ మేలును ఈ జన్మలో మరిచి పోలేనని తెలిపారు. ఇలాంటి ముఖ్యమంత్రి మహారాష్ట్రలో పుడితే పేద రైతులెందరో ఆయన కాళ్లకు దండం పెట్టుకునేవారన్నారు. ఈ సందర్భంగా ఆమె సీఎం కేసీఆర్కు, ఎమ్మెల్యే విఠల్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.