‘రంగస్థలం’లో రంగమ్మత్తగా నా పాత్రను చాలా మంది గుర్తుపెట్టుకున్నారు. ఆ సినిమా నుంచి భిన్నమైన పాత్రలపై దృష్టిపెట్టా. ‘పెదకాపు-1’ చిత్రంలో నా పాత్రకు కథాగమనంలో చాలా ప్రాధాన్యత ఉంటుంది’ అని చెప్పింది అనసూయ. విరాట్ కర్ణను హీరోగా పరిచయం చేస్తూ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మిర్యాల రవీందర్ రెడ్డి రూపొందించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది.
ఈ సందర్భంగా అనసూయ పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘ఈ సినిమాలో నా క్యారెక్టర్ గురించి ఎక్కువగా రివీల్ చేయను. నా పాత్ర పేరే చాలా కొత్తగా ఉంటుంది. విడుదల తర్వాత అందరూ అదే పేరుతో పిలుస్తారనుకుంటున్నా. నాతో పాటు సినిమాలో స్త్రీ పాత్రలన్నీ బలంగా ఉంటాయి. ఇప్పటివరకు కుటుంబ కథా చిత్రాలనే చేసిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఈ కథ చెప్పినప్పుడు షాక్ అయ్యాను. హీరో విరాట్ కర్ణ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. అతని వ్యక్తిత్వం బాగా నచ్చింది. భవిష్యత్తులో ఛాలెంజింగ్ రోల్స్ చేయాలనుకుంటున్నా. ‘పుష్ప-2’ షూటింగ్లో పాల్గొంటున్నా. తదుపరి చిత్రాల వివరాలను త్వరలో వెల్లడిస్తా’ అని తెలిపింది.