Pandu Master | తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమైన డ్యాన్సర్, కొరియోగ్రాఫర్ పండు మాస్టర్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. విశాఖపట్నం జిల్లా ఆనందపురం సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ప్రస్తుతం ఆయనకు ఆస్పత్రిలో చికిత్స అందుతోంది. ఈ ఘటనతో పండు మాస్టర్ అభిమానులు, టెలివిజన్ రంగానికి చెందిన ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం ప్రకారం, పండు మాస్టర్ తన డ్యాన్స్ టీమ్తో కలిసి తగరపువలసలో నిర్వహించిన అమ్మవారి ఉత్సవాల్లో ప్రత్యేక డ్యాన్స్ ప్రదర్శనలో పాల్గొన్నారు. కార్యక్రమం ముగిసిన అనంతరం బృందంతో కలిసి తిరుగు ప్రయాణం ప్రారంభించారు. అయితే మార్గమధ్యలో టీమ్లోని ఒక సభ్యుడు అస్వస్థతకు గురికావడంతో వాహనాన్ని రోడ్డుపక్కన నిలిపారు.
ఆ సమయంలో పండు మాస్టర్ కారులో నుంచి బయటకు వచ్చి రోడ్డుపై నిలబడి పరిస్థితిని గమనిస్తున్నారు. ఇదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన కోళ్ల వ్యాన్ అదుపుతప్పి ఆయనను ఢీకొట్టినట్లు తెలుస్తోంది. అనంతరం ఆ వ్యాన్ ఎదురుగా ఉన్న కారును కూడా ఢీకొట్టి ఆగిపోయింది. ఈ ప్రమాదంలో పండు మాస్టర్ తీవ్రంగా గాయపడగా, అక్కడున్న వారు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పండు మాస్టర్ టీమ్ సభ్యులు స్పందించి ఆయనను సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు వెంటనే చికిత్స ప్రారంభించినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ఘటనపై సమాచారం అందుకున్న నైట్ బీట్ పోలీసులు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన కోళ్ల వ్యాన్తో పాటు దెబ్బతిన్న వాహనాలను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగం లేదా ఇతర కారణాల వల్ల ప్రమాదం జరిగిందా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. పండు మాస్టర్ ‘ఢీ’ డ్యాన్స్ షో ద్వారా విపరీతమైన గుర్తింపు సంపాదించుకున్నారు. తన ప్రత్యేక డ్యాన్స్ స్టైల్, కొరియోగ్రఫీతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన, టెలివిజన్ షోలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యక్ష డ్యాన్స్ ఈవెంట్లలో కూడా పాల్గొంటూ వస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆయనకు ప్రమాదం జరగడం అభిమానులను కలవరపెడుతోంది. ప్రమాదంపై పూర్తి వివరాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉండగా, పండు మాస్టర్ త్వరగా కోలుకోవాలని అభిమానులు సోషల్ మీడియాలో ప్రార్థనలు చేస్తున్నారు