ప్రముఖ నటుడు డా.రాజేంద్రప్రసాద్ ఇటీవలే ప్రతిష్టాత్మక ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనను ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఆదివారం హైదరాబాద్లో ఘనంగా సత్కరించింది. ‘ఇది నా జీవితంలో మరిచిపోలేని సత్కారం. నాపై అభిమానంతో ఈ సత్కారాన్ని ఏర్పాటు చేసిన అందరికీ పేరుపేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. బాపు, జంధ్యాల, వంశీ లాంటి దర్శకులు అద్భుతమైన పాత్రలు రాయడం వల్లే నేను ఇలా ఉన్నాను. నాకు పద్మశ్రీ రావడం ఆలస్యమైందని చాలామంది అంటున్నారు. వారి అభిమానానికి ధన్యవాదాలు. తెలుగువారందరి హృదయాల్లో రాజేంద్రప్రసాద్ ఉన్నాడు.
అదే పెద్ద అవార్డ్. అయిదు జనరేషన్లు దాటి వచ్చాను. ఇప్పటి దర్శకులు కూడా నాకు మంచి పాత్రలు రాస్తున్నారు. ఎక్కడా రిలాక్స్ అయ్యే మనస్తత్వం కాదు నాది. ఇంకా మరిన్ని మంచి పాత్రలు పోషించి, మీకు మరింత వినోదాన్ని పంచేందుకు ప్రయత్నిస్తా’ అని డా.రాజేంద్రప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఫిల్మ్ క్రిటిక్స్ గౌరవ అధ్యక్షులు ప్రభు, అధ్యక్షులు బత్తుల ప్రసాదరావు, ప్రధాన కార్యదర్శి సురేశ్ కొండేటి, ఉపాధ్యక్షులు జనార్ధన్, అబ్దుల్, ట్రెజరర్ భరద్వాజ్, సీనియర్ పాత్రికేయులు మామిడాల గిరిధర్, మోహన్ గోటేటి, ఉమర్జీ అనూరాధ, లక్ష్మణరావు, ఆర్డీఎస్ ప్రకాశ్, నవీన్, బాలిరెడ్డి, భూషన్ కూడా మాట్లాడారు.