సినీరంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం గురించి సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారని, మరోమారు ఆయన్ని కలిసి పరిశ్రమల సమస్యలను వివరిస్తామని చెప్పారు అగ్ర నిర్మాత, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు దిల్ రాజు. సోమవారం హైదరాబాద్లో తెలుగు ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంయుక్త సమావేశాన్ని నిర్వహించాయి.
ఈ సందర్భంగా దిల్రాజు మాట్లాడుతూ ‘మా అభ్యర్థన మేరకు రవితేజ ‘ఈగల్’ చిత్రం సంక్రాంతి బరి నుంచి తప్పుకుంది. రిలీజ్ డేట్ను ఫిబ్రవరి 9కి మార్చుకోవడం జరిగింది. ఇప్పుడు అదే తేదికి సందీప్కిషన్ ‘ఊరి పేరు భైరవ కోన’ అనౌన్స్ చేశారు. ఈ విషయం ఛాంబర్ దృష్టికి రాగానే వెంటనే చిత్ర నిర్మాతలు అనిల్ సుంకర, రాజేష్తో మాట్లాడటం జరిగింది. మా వినతిని మన్నించి ఫిబ్రవరి 16కు సినిమాను మార్చుకుంటామని చెప్పారు.
ఈ సందర్భంగా ఛాంబర్ తరపున వారికి కృతజ్ఞతలు. ఇక ‘ఈగల్’ చిత్రానికి ఎక్కువ థియేటర్లు వచ్చేలా చూస్తాం. అదే డేట్కు ‘యాత్ర-2’ కూడా వస్తున్నది. రాజకీయ పరమైన అంశంతో వారు ముందే డేట్ ఫిక్స్ చేసుకోవడంతో ఛేంజ్ చేసుకోవడానికి ఒప్పుకోలేదు’ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో జరిగిన మీటింగ్ విశేషాలను తెలియజేస్తూ ‘ప్రభుత్వం తరపున ఏ సహాయం కావాలన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నామని సీఎం చెప్పారు. ఎల్లుండి ఈసీ మీటింగ్లో అన్ని విషయాలు చర్చించి మరోసారి సీఎంను కలుస్తాం’ అన్నారు. ఈ కార్యక్రమంలో దామోదరప్రసాద్, ప్రసన్నకుమార్, వివేక్ కూచిభొట్ల తదితరులు పాల్గొన్నారు.