పాఠశాలలు, గురుకుల విద్యాలయాలు, సంక్షేమ హాస్టళ్లు, కళాశాలల్లో విద్యార్థులు పెద్ద సంఖ్య కరోనా బారిన పడుతుండటంతో వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. పలు విద్యాసంస్థల్లో విద్యార్థులు పదుల సంఖ్యలో పాజిటివ్కు గురవుతున్న నేపథ్యంలో ఆయా విద్యాసంస్థల్లో కరోనా పరీక్షలను నిర్వహిస్తున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోని విద్యా సంస్థల్లోని విద్యార్థులు ఎక్కువగా వైరస్బారిన పడుతున్నారు. తాజాగా ఆదివారం శంషాబాద్లోని మహాత్మా జ్యోతిరావు ఫూలే సంక్షేమ హాస్టలో 45 మంది విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడు.. పాతబస్తీలోని ఒక హాస్టల్లో 9మంది విద్యార్థులు, ఒక ఆశా వర్కర్ కరోనా వైరస్కు గురయ్యారు. దీంతో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు చెందిన వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు ఆయా పాఠశాలలు, హాస్టళ్లలో కరోనా పరీక్షలు ముమ్మరం చేశారు. సెలవు రోజుల్లో కూడా పరీక్షలు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
మహాత్మాజ్యోతిరావు ఫూలే హాస్టల్లో టీచర్తో పాటు 46 మందికి కరోనా పాజిటివ్ రావడంతో విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. హాస్టల్ వార్డెన్ శివగీత వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం, పాలమాకుల గ్రామంలోని మహాత్మాజ్యోతిరావు ఫూలే హాస్టల్లో రాజేంద్రనగర్, మహేశ్వరం, మియాపూర్ నియోజకవర్గాలకు చెందిన పిల్లలు ఉంటున్నారు. ఇందులో దాదాపు వెయ్యి మంది విద్యార్థులు ఉన్నారు. గత రెండు రోజుల నుంచి విద్యార్థినులు నీరసంగా కనిపించడంతో విద్యార్థినులతో పాటు ఉపాధ్యాయులకు, సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇందులో ఒక టీచర్తో పాటు 45 మంది విద్యార్థినులకు పాజిటివ్గా తేలింది. పాజిటివ్ వచ్చిన విద్యార్థినులను హాస్టల్లోని మూడు గదుల్లో ఏర్పాటు చేసిన ఐసొలేషన్ లో ఉంచి వైద్య సేవలు అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెంది.. తమ పిల్లలను ఇంటికి తీసుకువెళ్తున్నారు. ఇప్పటి వరకు 16 మంది విద్యార్థినుల తల్లిదండ్రుల నుంచి లెటర్ రాసుకొని వారిని ఇంటికి పంపించినట్లు వార్డెన్ తెలిపారు. మిగతా విద్యార్థినులు ఇక్కడే ఉన్నారు.
పాతబస్తీలో విద్యార్థులపై కరోనా పంజా విసిరింది. రాజన్నబావి శివాజీనగర్లో ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహంలో తొమ్మిది మంది విద్యార్థినులకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో విద్యార్థినులతోపాటు వసతి గృహం నిర్వాహకులు, బస్తీ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వివరాల్లోకి వెళితే.. కరోనా పరీక్షల్లో భాగంగా ఆదివా రం బాలాగంజ్ యూపీఎస్ డాక్టర్లు, ఆశా వర్కర్లు ప్రస్తుతం బీసీ హాస్టల్స్లో ఉంటున్న 70 మంది విద్యార్థినులకు కరోనా టెస్టులు చేశారు. ఈ టెస్ట్లో 9 మంది విద్యార్థినులకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు డాక్టర్లు నిర్ధారించారు. పాజిటివ్ వచ్చిన విద్యార్థినులకు ఐసొలేషన్ గదులను కేటాయించి వైద్య సేవలు అందిస్తున్నారు. వేరే విద్యార్థులకు సంబంధం లేకుండా బాత్రూంలు ఏర్పా టు చేశారు. పాజిటివ్ వచ్చిన విద్యార్థినులు మహబూబ్నగర్, గద్వాల్, నల్గొండ జిల్లాలకు చెందిన వారుగా గుర్తించారు. వెంటనే వారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వీరితో పాటు బస్తీలో కరోనా టెస్టులు నిర్వహిస్తున్న ఓ ఆశా వర్కర్కు కూడా పాజిటివ్ వచ్చినట్లు డాక్టర్లు వెల్లడించారు. ఆర్బీహెచ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అమీనా ఆధ్వర్యంలో కరోనా టెస్టులు నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం వెంటనే పాఠశాలలు, కళాశాలలు, గురుకుల హాస్టళ్లను మూసివేసి విద్యార్థుల ప్రాణాలను కాపాడాలని ప్రేరణ బాలల వేదిక తెలంగాణ అధ్యక్షుడు అక్కెనపల్లి లక్ష్మణాచారి విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ .. ప్రపంచ దేశాలను వణికించి.. మళ్లీ కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో విద్యార్థుల ప్రాణాలను కాపాడి, కరోనా నివారణకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటీవల పాఠశాలలు, గురుకుల హాస్టళ్లు తెరుచుకోవడంతో అభం, శుభం తెలియని విద్యార్థులు కరోనా బారిన పడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే 6 నుంచి 8వ తరగతి విద్యార్థులకు సెలవులు ప్రకటించి.. డిజిటల్ క్లాస్లు, ఆన్లైన్లో విద్యా బోధన చేయాలని కోరారు. విద్యార్థుల ఆరోగ్యాలపై తల్లిదండ్రులు కూడా ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆయన కోరారు.
జూబ్లీహిల్స్ డివిజన్, జవహర్కాలనీలో కరోనాతో ఓ వ్యక్తి మృతి చెందాడు. బీహెచ్ఈఎల్లో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేసి రిటైరయిన వ్యక్తి(60)కి కరోనా రావడంతో నాలుగురోజుల క్రితం గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటినుంచి చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. దీంతో స్థానికంగా ఆందోళన నెలకొంది. కరోనా రెండోదశ వస్తోందని.. ఇప్పటికే భయపడుతున్న జనం.. తాజా ఘటనతో స్థానికంగా తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.