తరుణ్, శ్రియ జంటగా దర్శకుడు త్రివిక్రమ్ రూపొందించిన సినిమా ‘నువ్వే నువ్వే’. స్రవంతి మూవీస్ పతాకంపై రవికిషోర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా విడుదలై సోమవారానికి ఇరవై ఏండ్లవుతున్నది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హీరో తరుణ్ మాట్లాడుతూ..‘మా సినిమా విడుదలై 20 ఏండ్లవుతుందంటే నమ్మలేకుండా ఉంది. ఇవాళే మొదటి షో చూసినట్లు అనిపిస్తున్నది. ఇలాంటి మరో సినిమా చేయమని చాలా మంది అడిగారు. త్రివిక్రమ్ ఎంత మంది హీరోలతో సినిమాలు చేసినా ఆయన మొదటి హీరోను నేనే’ అన్నారు. త్రివిక్రమ్ మాట్లాడుతూ…‘నువ్వే కావాలి’ సమయంలో నిర్మాత రవికిషోర్కు సరదాగా చెప్పిన కథ ఇది. వెంటనే ఆయన చెక్ రాసి ఇస్తూ సినిమా చేద్దామన్నారు. అలా మొదలైన ఈ సినిమాతో మాకెన్నో జ్ఞాపకాలు మిగిలాయి. నన్ను మొదటి నుంచి ప్రోత్సహించిన నిర్మాత రవికిషోర్ గారికి థాంక్స్’ అన్నారు. ‘ఈ సినిమాకు మంచి కథ, కథనాలతో పాటు ప్రతిభగల నటీనటులు కుదిరారు అందుకే ఇప్పటికీ గుర్తుండిపోయే సినిమా అయ్యింది’ అని నిర్మాత రవికిషోర్ అన్నారు. ప్రకాష్రాజ్ మాట్లాడుతూ..‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమా సమయంలో నాపై నిషేధం ఉంది. ఆ బ్యాన్ ఎత్తివేసే వరకు నాకోసం ఈ టీమ్ ఆగారు. ఈ చిత్ర బృందం అంతా సినిమా మీద ప్రేమ ఉన్న వాళ్లు. ఈ సినిమా ఎన్నో జ్ఞాపకాల్ని ఇచ్చింది’ అన్నారు. ఈ కార్యక్రమంలో నాయిక శ్రియ, మధుమిత, శిల్పా చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.