పెద్దఅంబర్పేట, మార్చి 30: అభివృద్ధే లక్ష్యంగా ప్రజాప్రతినిధులు, అధికారులు సమ న్వయంతో ముందుకు వెళ్లాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డివెంకట్రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మంగళవారం పెద్దఅంబర్పేట మున్సిపల్ 2021-2022 బడ్జెట్ సమావేశానికి వారు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదర్శవంత మున్సిపాల్టీగా తీర్చిదిద్దాలని సూచించారు. అనంతరం రూ. 38 కోట్ల38 లక్షల ఏడు వేలతో మున్సిపల్ బడ్జెట్ మున్సిపల్ చైర్పర్సన్ చెవుల స్పప్న ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మురికి వాడల ప్రాంతాలలో మౌళిక వసతుల కల్పనకు బడ్జెట్లో కేటాయింపులు చేశామన్నారు. అదే విధంగా పార్కులు, వైకుంఠ ధామాలు, ప్రజామరుగుదొడ్లు, సమీకృత సంతల అభివృద్ధి జంతువధశాల, డంప్ యార్డుల నిర్వహణ వంటి పనులకు నిధులు కేటాయించామన్నారు.
ఈ సందర్భంగా పలువురు కౌన్సిలర్లు పలు సమస్యలను అధికారుల, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువచ్చారు. పెద్ద అంబర్పేట నుంచి మునగనూర్ రోడ్డు ఇటీవల కురిసిన వర్షాలకు ధ్వంసం అయిందని, సమస్య పరిష్కరించాలని కౌన్సిలర్లు చల్లూరి మురళీధర్రెడ్డి, పండుగుల జయశ్రీ అన్నారు. ఇందు అరణ్య అపార్ట్మెంట్, విల్లాస్ ప్రాంతంలో కొన్ని నివాసాలు రిజిస్ట్రేషన్లు కావడం లేదని, వంటనే పరిష్కారం చూపాలని కౌన్సిలర్లు రోహిణీరెడ్డి, శ్రీధర్రెడ్డిలు కోరారు. టౌన్ ప్లానింగ్ సెక్షన్లో అధికారులు లేక ప్రజలు నానా వస్థలు పడుతున్నారని కౌన్సిలర్ లక్ష్మణ్ అన్నారు. రాజీవ్గృహకల్ప భూదాన్ కాలనీలలో సమస్యలు పరిష్కరించాలని కౌన్సిలర్ శ్రీనివాస్ వివరించారు. డ్రైనేజీ సమస్యలు పరిష్కరించాలని కౌన్సిలర్ సిద్దంకి కృష్ణారెడ్డి కోరారు. అనంతరం అధికారులు, కౌన్సిలర్లు ఎంపీ, ఎమ్మెల్యేను సన్మానించారు. ఈ సమా వేశంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ చామ సంపూర్ణారెడ్డి, కమిషనర్ బలరాం, మున్సిపల్ అధికారులు, ఇతర శాఖల అధికారులు, కో ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.