Ramayanam | రామాయణ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కించిన ‘ఆదిపురుష్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలవడమే కాకుండా దేశ వ్యాప్తంగా వివిధ వర్గాల నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారి తెరకెక్కించబోతున్న రామాయణం గురించి చర్చ మొదలైంది. ‘దంగల్’ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న దర్శకుడు నితీష్ తివారి రామాయణ గాథను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రాముడి పాత్రలో రణబీర్కపూర్ నటించనున్నారని వార్తలొస్తున్నాయి.
తాజాగా ఈ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు బాలీవుడ్ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్. ‘ఆదిపురుష్’ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని దర్శకుడు నితీష్ తివారి తన రామాయణం సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలిపారు. ‘ఈ మధ్య నేను నితీష్ తివారిని కలిశాను. మూడు భాగాలుగా రామాయణాన్ని తెరకెక్కించబోతున్నానని ఆయన నాతో చెప్పారు. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా స్క్రిప్ట్ సిద్ధం చేశానన్నారు. సినిమా సెట్స్పైకి వెళ్లే ముందు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్తలను సంప్రదించి వారి సలహాలు తీసుకునే ఆలోచనలో నితీష్ తివారి ఉన్నారు’ అని తరణ్ ఆదర్శ్ తెలిపారు.