ఓ వైపు నటన, మరో వైపు చిత్ర నిర్మాణం అంటూ బిజీబిజీగా ఉంటున్నది మెగా డాటర్ నిహారిక కొణిదెల. ఆమె సమర్పణలో యదు వంశీ దర్శకుడిగా, పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మిస్తున్న చిత్రానికి ‘కమిటీ కుర్రాళ్లు’ అనే పేరును ఖరారు చేశారు. సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఋశ్వర్ రాచిరాజు, త్రినాథ్వర్మ, ప్రసాద్ బెహరా, మణికంఠ పరసు, లోకేశ్ కుమార్ పరిమి, శ్యామ్ కల్యాణ్, రఘునందన్, శివకుమార్ మట్ట, అక్షయ్ శ్రీనివాస్, శరణ్య సురేశ్, తేజస్విరావు, టీన శ్రావ్య, విషిక, షణ్ముఖి నాగుమంత్రి ప్రధాన పాత్రధారులు.
ఉగాది సందర్భంగా ఈ చిత్రం టైటిల్ పోస్టర్ని హీరో సాయిదుర్గతేజ్ ఆవిష్కరించి చిత్ర యూనిట్కి శుభాకాంక్షలు అందించారు. ‘ఇంతమంది కొత్తవాళ్లతో సినిమా చేయడం బాధ్యతగా భావిస్తున్నాను. ‘కమిటీ కుర్రాళ్లు’ అనే టైటిల్ ఈ కథకు యాప్ట్. తప్పకుండా అందరికీ నచ్చే సినిమా అవుతుంది’ అని నిహారిక నమ్మకం వెలిబుచ్చారు.
చిత్రీకరణ పూర్తయిందని, ఇందులో 11మంది హీరోలను, 4 హీరోయిన్లను పరిచయం చేస్తున్నామని దర్శకుడు తెలిపారు. మంచి కంటెంట్ ఉన్న సినిమాలను మాత్రమే నిర్మిస్తామని, విభిన్న కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని, త్వరలో సినిమాను విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: రాజు ఎడురోలు, సంగీతం: అనుదీప్ దేవ్.