హైదరాబాద్ : ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతిపై కిమ్స్ వైద్యులు ప్రకటన విడుదల చేశారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి ఊపిరితిత్తుల క్యాన్సర్ సంబంధిత సమస్యలతో మంగళవారం సాయంత్రం 4.07 గంటలకు తుదిశ్వాస విడిచారని తెలిపారు. న్యుమోనియాతో 24న సికింద్రాబాద్లోని కిమ్స్ చేరారన్నారు. ఐసీయూలో ఉంచి ఎక్మో మిషన్పై చికిత్స అందించామన్నారు. చివరకు ఇన్ఫెక్షన్ శరీరమంతా వ్యాపించడంతో పరిస్థితి విషమించి కన్నుమూశారన్నారు.
అయితే, గత ఆరు సంవత్సరాల క్రితమే ఊపిరితిత్తుల క్యాన్సర్ బారినపడడంతో సగం ఊపిరితిత్తిని తొలగించామన్నారు. ఆ తర్వాత ఆయనకు బైపాస్ సర్జరీ కూడా చేసినట్లు తెలిపారు. మళ్లీ గతవారం కిందట మరో వైపు ఉన్న ఊపిరితిత్తులకు క్యాన్సర్ సోకిందని, దీంతో ఆపరేషన్ చేసి సగం తొలగించినట్లు చెప్పారు. ఆ తర్వాత రెండు రోజులు బాగున్నారని , 55 శాతం ఉన్న ఊపిరితిత్తులకు కూడా ఇన్ఫెక్షన్ వచ్చిందన్నారు. ఆక్సినేషన్ లేకపోవడంతో ఐదు రోజులు ఎక్మో మిషన్పై ఉంచామని తెలిపారు. ఆ తర్వాత క్యాన్సర్, పోస్ట్ బైపాస్ సర్జరీ, కిడ్నీలు దెబ్బతినడం, ఇన్ఫెక్షన్ శరీరమంతా సోకి చివరకు తుది శ్వాస విడిచారన్నారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం ప్రకటించారు.