Nayanthara | ప్రముఖ నటి నయనతార, దర్శకుడు విఘ్నేశ్ శివన్ దంపతులపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. ఈ జంట పెళ్లైన నాలుగు నెలలకే తల్లిదండ్రులవ్వడమే ఇందుకు ప్రధాన కారణం. సరోగసి ద్వారా నయన్-విఘ్నేశ్ దంపతులు కవలలకు తల్లిదండ్రులయ్యారనే వార్తలు పెద్ద దుమారం రేగాయి. పెళ్లైన నాలుగు నెలలకే పిల్లల్ని కనడంపై విమర్శలు సైతం ఎదుర్కోవాల్సి వచ్చింది. తాజాగా, విమర్శకులకు నయన్ పెద్ద ట్విస్ట్ ఇచ్చింది.
సరోగసి వివాదం నేపథ్యంలో తమిళనాడు వైద్య శాఖ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఇందుకోసం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ విచారణ కూడా చేపట్టింది. విచారణలో భాగంగా నయన్… తన సరోగసికి సంబంధించిన పూర్తి ఆధారాలను కమిటీకి సమర్పించినట్లు సమాచారం. తాము ఆరేళ్ల క్రితమే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నామని కమిటీకి సమర్పించిన అఫిడవిట్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన పత్రాలను నయనతార ఆ కమిటీకి అందించినట్లు సమాచారం. అదే విధంగా గత డిసెంబర్లో అద్దె గర్భం కోసం రిజిస్టర్ చేసుకొని, ఇద్దరు మగ కవలలకు జన్మనిచ్చినట్లు ప్రభుత్వానికి అందించిన అఫిడవిట్లో పేర్కొనట్లు తెలుస్తోంది. అంతేకాదు యూఏఈలో ఉన్న తన బంధువు ద్వారా సరోగసి పద్ధతిలో పిల్లల్ని పొందినట్లు నయనతార స్పష్టం చేసినట్లు సమాచారం. తమిళనాడు ప్రభుత్వానికి నయన్ అందించిన ఆధారాలతో విమర్శకులకు, సరోగసి వివాదానికి చెక్ పెట్టినట్లైంది.
కొత్తగా అమల్లోకి వచ్చిన సరోగసిచట్టం ప్రకారం ఐదేళ్ల వివాహ బంధాన్ని పూర్తిచేసుకున్న దంపతులు మాత్రమే సరోగసికి అర్హులు. భార్య వయసు కచ్చితంగా 25 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. అలాగే భర్త వయసు 26 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండాలి. అంతేకాకుండా, ఆ దంపతులకు జన్యుపరంగా కానీ, దత్తత ద్వారా కానీ ఒక్క సంతానం కూడా ఉండకూడదు. అలాగే, అద్దె తల్లి ఈ దంపతులకు దగ్గర బంధువై ఉండాలి. ఆమెకు పెళ్లై ఉండాలి, అప్పటికే బిడ్డకు జన్మనిచ్చి ఉండాలి. వయసు 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. ఆమె జీవితంలో ఒక్కసారి మాత్రమే సరోగసి ద్వారా పిల్లల్ని కనాలి.