హైదరాబాద్ : సినీ జగత్తులో ఎప్పుడూ సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉండే ప్రముఖ దర్శక, నిర్మాత రాంగోపాల్ వర్మ నిర్మించిన ‘వ్యూహం’ సినిమాపై టీడీపీ నాయకుడు నారా లోకేష్(Nara Lokesh) టీఎస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వ్యూహం సినిమా సెన్సార్ సర్టిఫికెట్ (Censor certificate) ను రద్దు చేయాలని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు.
కాగా ఈ కేసుపై ఈ నెల 26న విచారణకు రానుంది. ఆర్జీవీ ఇష్టమొచ్చినట్లు పాత్రలను సృష్టించారని లోకేష్ ఆరోపించారు. ఈ సినిమాలో చంద్రబాబును తప్పుగా చూపించారని, ఆయనను అప్రతిష్ఠపాలు చేసేందుకే సినిమా తీశారని, ట్రైలర్లో మాదిరిగానే సినిమా అంతా ఉండే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
కాగా నారా లోకేష్ వేసిన పిటిషన్పై ఆర్జీవీ స్పందించారు. తాను తీసిన లక్ష్మీస్ ఎన్టీఆర్, వ్యూహం సినిమాల్లో ఎవరనీ కించపరిచేవిధంగా తీయలేదని అన్నారు. ఆ సినిమాల్లో వారి పాత్రలు ఉండడం వల్లే తప్పుగా అర్థం చేసుకుంటున్నారని తెలిపారు. అవసరమైతే టీడీపీ వారు కూడా సినిమాలు తీసుకోవచ్చని సూచించారు. తనకు సినిమా, రాజకీయం ఒక్కటేనని పేర్కొన్నారు. తనను ఢీ కొనాలంటే తన మాదిరే సినిమాతీయాలని హితవు పలికారు.