నాగశౌర్య, యుక్తి తరేజా జంటగా పవన్ బాసంశెట్టి దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘రంగబలి’. సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఇటీవలే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. శనివారం సక్సెస్మీట్ను నిర్వహించారు. నాగశౌర్య మాట్లాడుతూ ‘ఈ సినిమాలోని వినోదం ప్రతీ ఒక్కరిని ఆకట్టుకుంటున్నది. ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుతున్నారు. ‘ఛలో’ తర్వాత నా కెరీర్లో మరో భారీ విజయమిది. నటుడిగా నేను కొత్తదారిలో పయనిస్తున్నా.
కథాంశాల పరంగా వైవిధ్యానికి పెద్దపీట వేయాలన్నదే నా లక్ష్యం. ఈ సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులందరికి కృతజ్ఞతలు’ అన్నారు. ‘ప్రథమార్థంలో నాగశౌర్య, సత్య, రాజ్కుమార్ పాత్రలు చక్కటి వినోదాన్ని పంచాయి. ద్వితీయార్థంలో ఎమోషన్స్తో పాటు సందేశం ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నది’ అని దర్శకుడు తెలిపారు. తెలుగులో తాను నటించిన తొలి చిత్రం మంచి విజయం సాధించడం ఆనందంగా ఉందని కథానాయిక యుక్తి తరేజా పేర్కొంది.